భార్యకు బంగారం కూడా కొనివ్వలేదు.. 100 కోట్ల అప్పు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదనకు కారణమేంటో..!
సంగారెడ్డి : రాజకీయ నేతలంటే ఫుల్లుగా సంపాదిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఎమ్మెల్యే ఐతే చాలు అంతకు ముందు ఆస్తులున్నా లేకున్నా.. కోట్లకొద్దీ కూడబెడతారనేది జగమెరిగిన సత్యం. ఒక్కరో ఇద్దరో సత్యానికి కట్టుబడి ఉన్నా.. దాదాపు పొలిటికల్ లీడర్లంటే ఆస్తులు కూడబెట్టుకుంటారనే పేరుంది. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యాలు పొలిటికల్ సర్కిల్లో చర్చానీయాంశంగా మారాయి. తనకు వంద కోట్ల అప్పు ఉందని.. కనీసం తన భార్యకు 20 తులాల బంగారమైనా కొనివ్వలేదని మాట్లాడిన తీరు హాట్ టాపికైంది.
జగ్గారెడ్డి మనసులోని ఆవేదన
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏది మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. సీఎం కేసీఆర్పై ఆరోపణలు గుప్పించినా.. మంత్రి హరీశ్ రావుపై మాటల తూటాలు సంధించినా.. ఆయన తీరు అదోలా ఉంటుంది. అయితే తాజాగా ఆయన మాట్లాడిన తీరు మాత్రం చర్చానీయాంశమైంది. రాజకీయాల్లోకి వచ్చాక బాగా అప్పులు చేశానంటూ జగ్గారెడ్డి చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. వంద కోట్ల రూపాయల అప్పు ఉందని.. ఇప్పటికీ పండుగలొస్తే అప్పులు చేస్తానని వ్యాఖ్యానించడం హాట్ టాపికైంది.
దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!
కోట్ల రూపాయల అప్పు.. ఎవరూ నమ్మరుగా అంటూ..!
కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పటికీ ఈ విషయం ఎవరూ నమ్మబోరని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భార్యకు ఇప్పటిదాకా కనీసం 20 తులాల బంగారు ఆభరణాలు కూడా కొనివ్వలేదన్నారు. నా వెంట ఉండే పార్టీ క్యాడర్.. సన్నిహితులే తనను ముందుకు నడిపిస్తున్నారని.. అప్పుల్లో ఉండి కూడా తాను ఎవరికీ అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో శుక్రవారం నాడు జరిగిన కార్యకర్తల సమావేశంలో తన మనోవేదన బయటకు చెప్పుకున్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలకు అండగా ఉండటం.. వారి కష్టాల్లో పాలు పంచుకోవడమే తన ఎజెండాగా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.
ఆర్టీసీ సమ్మెపై సీఎం స్పందించాలి.. లేకుంటే తిప్పలే
ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని జేఏసీ నేతలు జగ్గారెడ్డికి వినతి పత్రం అందించారు. ఆ మేరకు కార్మికులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాని పక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయంలో కేసీఆర్ వెంటనే తగు నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని సూచించారు.
14 ఏళ్లుగా మంత్రి హరీశ్తో మాటల్లేవు.. కానీ
బుధవారం (09.10.2019) నాడు దసరా వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా మంత్రి హరీశ్ రావుతో మాటల్లేవని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం మళ్లీ ఆయనతో మాట్లాడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు, వ్యక్తులకు తల వంచబోనని.. కేవలం ప్రజల ముందే తల వంచుతానని స్పష్టం చేశారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తే బతికినన్ని రోజులు ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు.
పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం.. అల్లుడిని చితక్కొట్టిన అత్తమామలు.. ఉతికి ఆరేశారుగా (VIDEO)
సంగారెడ్డి అభివృద్ధికి సహకరిస్తే కేసీఆర్కు తల వంచుతానంటూ..!
అదలావుంటే శుక్రవారం (11.10.2019) నాడు సీఎం కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేయూత అందిస్తే ఆయన ఎదుట తల వంచుతానంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నియోజకవర్గం కోసం ఏదైనా చేస్తా అంటూ ఆయన మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. అయితే తను ఏది మాట్లాడినా ఒక ఎత్తుగడ ఉండే జగ్గారెడ్డి వ్యాఖ్యల మర్మం ఏంటో అన్నది వేచి చూడాల్సిందే.