భారీ వర్షాలకు కూలిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపూర్ కోట..నాలుగు ఇళ్ళు ధ్వంసం
విపరీతంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి . జనగామ జిల్లాలో ఓ పురాతన కోట కుప్పకూలింది . 18వ శతాబ్దంలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ కోట కుప్ప కూలింది . సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గోడ శిధిలం అయ్యింది . కోట గోడ కూలటంతో అక్కడ పక్కనే ఉన్న నాలుగు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి .
విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎన్నడో నిర్మించిన పురాతన కోట గోడ కూలటంతో ఇళ్ళు ధ్వంసం కాగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని ముందే గమనించిన ఇళ్ళ లోని వారు బయటకు పరుగులు తీయటం తో ప్రాణ నష్టం తప్పింది . ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు . సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఈ కోటను అధికారులు పట్టించుకోకపోవటంతోనే ఈఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు.
భారీ వర్షాలకు కూలిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపూర్ కోట .. pic.twitter.com/qkH4mhDVTK
— oneindiatelugu (@oneindiatelugu) October 15, 2020
దొరలు , భూస్వాముల వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుడు , నిరుపేదలకు అండగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ కోటను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా ప్రకటించి నాలుగు కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు . ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన నేపధ్యంలోనైనా అధికారులు కోట పూర్తిగా కూలిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.