సారిక లేఖలో మరిన్ని విషయాలు: కుమారుడి కిడ్నాప్నకు రాజయ్య ఫ్యామిలీ యత్నం
వరంగల్: వరంగల్లో అత్తామామలతో వేగలేక 2011లో హైదరాబాద్లో ఒక ఉద్యోగంలో చేరి, బాబును చూసుకుంటూ ఉంటే బాబును కిడ్నాప్ చేసి తీసుకుపోయేందుకు ప్రయత్నించారని మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కోడలు సారిక నాలుగేళ్ల కిందటి మెయిల్లో రాసింది. అప్పటి నుంచి బాబుకు,తనకు హాని తలపెడతారేమోనని తనకు భయం పట్టుకుందని అన్నారు.
తనకు, తన బిడ్డకు ఏమైనా జరిగితే అందుకు ఆ ముగ్గురు బాధ్యులవుతారని ఆమె తన మెయిల్లో స్పష్టంచేశారు.అనుమానాస్పద స్థితిలో పిల్లలతో సహా సారిక సజీవ దహనమైన నేపథ్యంలో నాలుగేండ్ల క్రితం షాహెన్స్ అనే మహిళ సంస్థకు రాసిన ఈ మెయిల్ ఇప్పుడు కీలకంగా మారింది. తనను కోడలిగా కాకున్నా కనీసం సాటి మనిషిగా కూడా చూడలేదని 2011లో షాహెన్స్ అనే మహిళా సంస్థకు పంపిన ఈమెయిల్లో వాపోయారు. తన భర్త కాల యముడని ఆరోపించారు.
మెట్టినింటికి వచ్చిన తర్వాత పరిణామాలను, సాధింపులను వివరించిన సారిక తన అత్త చేతిలో ఈసడింపులకు గురవుతున్నానని ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషించేదని, ఆమెను తన మామ ఎన్నడూ అడ్డుకునేవారు కాదని తెలిపారు. ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు.. అంటూ తన మీద మీదకు వచ్చి, వస్తువులు విసిరి, చేయి చేసుకొని ఇంట్లోంచి గెంటేసిందని చెప్పారు.

ఏడ్చుకుంటూ వెళ్లి పోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకు వంత పాడాడే కానీ, నన్ను ఓదార్చలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్లానో, చచ్చానో, బతికానో కూడా పట్టించుకోలేదని తెలిపారు. అత్త పెట్టే బాధలు భర్తకు చెప్తే తనపైనే చేయిచేసుకునేవాడని వివరించారు.
తన చెల్లిలి వివాహం తర్వాత తన పుట్టింటితో రాకపోకలు మొదలయినా వాళ్లతో సరిగా మాట్లాడనిచ్చేవాడు కాదని తెలిపారు. ఫోన్ స్పీకర్ పెట్టే మాట్లాడాలనే వాడని, నా ఫోన్లో కాల్ లాగ్స్ చెక్ చేసి, ఆరాలు తీసేవాడని అన్నారు.
ఉద్యోగం, వ్యాపారం ఏదీ లేకుండా తన భర్త తిరుగుతున్నా అనిల్ను తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదని, కేవలం అవసరాలు తీర్చుకోడానికే ఇంటికి వచ్చేవాడని, తర్వాత పనులున్నాయని బయటకు వెళ్లిపోయేవాడని తెలిపారు. తన మామ ఎంపీ అయిన తర్వాత మొత్తానికే రావడం మానేశాడని అన్నారు.












Click it and Unblock the Notifications