కడియంపై సర్వే సంచలన వ్యాఖ్య, వందేళ్లు హైద్రాబాద్లోనే: రాజేంద్రప్రసాద్
వరంగల్: మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం ఏ కులమో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశంలో సర్వే సత్యనారాయణ, కుంతియా, బస్వరాజు సారయ్య, చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆరు లక్షల మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించాలన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ కనీసం ఊరికి ఓ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు తాము వరంగల్ లోకసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. విజయం మాదే అన్నారు. గెలిపించిన ప్రజలను కేసీఆర్ విస్మరించి పదవిలో కొనసాగుతున్నారన్నారు.
సీనియర్ నేత కుంతియా మాట్లాడుతూ.. వరంగల్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రైతులకు, విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. వారు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాలా అన్నారు.
పదేళ్లు కాదు వందేళ్లు ఉంటాం: రాజేంద్ర ప్రసాద్
హైదరాబాదు అందరిదని, ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లే కాకుండా వందేళ్లయినా ఇక్కడే ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గురువారం అన్నారు. సీమాంధ్రులను వెళ్లమనే హక్కు ఎవరికీ లేదన్నారు. అవసరమైతే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తామన్నారు.
తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ కబ్జా చేయాలనుకుంటున్నారని, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఏదో విధంగా టీఆర్ఎస్లోకి లాక్కోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇతర పార్టీలకు ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు దుష్టచతుష్టయం అన్నారు.












Click it and Unblock the Notifications