ఆర్ఎస్ఎస్గా మారిన టీఆర్ఎస్! పౌరహక్కుల సంఘం ఆరోపణ
శాతవాహన యూనివర్సిటీలోని తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్న విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పోలీసుల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పౌరహక్కుల సంఘం మండిపడుతోంది. యూనివర్సిటీల విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అంశం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా పనిచేసిన టీఆర్ఎస్ ఇప్పుడు తన ఉద్యమ లక్ష్యం వీడింది అని ఆర్ఎస్ఎస్ కు రాష్ట్ర శాఖ గా పనిచేస్తుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టు పార్టీ ప్రచార కలకలం .. ఓ ప్రొఫెసర్ తో పాటు ముగ్గురు టీవీవీ విద్యార్ధి నేతల విచారణ
శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత తో పాటు మరో ముగ్గురు టీవీవీకి చెందిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫోకస్ యూనివర్సిటీ లపై మళ్లింది. నాగపూర్, పూణే జైళ్లలో ఉన్న ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా , విప్లవ కవి వరవరరావులను విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, కరపత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిపై దృష్టిసారించిన పోలీసులు తెలంగాణ విద్యార్థి వేదిక మావోయిస్టు పార్టీ కవర్ ఆర్గనైజేషన్ గా అనుమానిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ పై దృష్టిపెట్టిన పోలీసులు కొరివి సూర్యుడు, కరికి మహేష్ , రాజులతో పాటు మరికొంతమంది ఇటీవల చత్తీస్గడ్ కి వెళ్లి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ను కలిసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు చెబుతున్నారు. ఇక ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత స్టడీ టూర్ ల పేరుతో ఛత్తీస్ ఘడ్ లోని మారుమూల ప్రాంతాలకు విద్యార్థులను తీసుకువెళ్లి మావోయిస్ట్ లతో సమావేశాలను ఆర్గనైజ్ చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్ పరీక్షల అవకతవకలపై ప్రశ్నించినందుకే విద్యార్థులకు వేధింపులు అని మండిపడుతున్న పౌర హక్కుల సంఘం నేతలు
అయితే ఇదంతా తప్పని కావాలని విద్యార్థి నాయకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని పౌరహక్కుల సంఘం నేతలు మండిపడుతున్నారు. టి.వి.వి విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి వ్యాఖ్యలను బాధ్యతారాహిత్య వ్యాఖ్యలుగా పౌరహక్కుల సంఘం నేత నారాయణ రావు ఆరోపించారు. టీవీవీ సంస్థపై, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై కేవలం ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఈ తరహా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఇంటర్ పరీక్షలు అవకతవకలపై ప్రశ్నించినందుకు, గ్లోబరీనా దుర్మార్గాలను నిలదీసినందుకు విద్యార్థులను వేధిస్తున్నారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు రాష్ట్ర శాఖ గా పనిచేస్తుందని మండిపడిన పౌర హక్కుల సంఘం
అంతేకాదు టిఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీల కాషాయీకరణ కు ఆర్ఎస్ఎస్ కి సహకరిస్తుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు రాష్ట్ర శాఖ గా పనిచేస్తుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎవరైతే కాషాయీకరణ కు వ్యతిరేకంగా నిలుస్తారో అటువంటి విద్యార్థులపై మావోయిస్టులుగా ముద్ర వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని పౌరహక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ తరహా ప్రభుత్వ చర్యలను పౌర హక్కుల సంఘం ఖండిస్తోందని పేర్కొంది. తక్షణం విద్యార్థులపై, ప్రొఫెసర్ పై వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications