టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు భారీగా తగ్గింపు: రూట్ ఇదే
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. పండగ సీజన్ లల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేయడం వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెంచుకుంటోంది.
అదే సమయంలో మరో ఆఫర్ను తెర మీదికి తీసుకొచ్చింది. ప్రయాణ ఛార్జీలో 20 నుంచి 25 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య వివిధ రకాల బస్ సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి.

సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్- బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. జహీరాబాద్, వరంగల్, ఖమ్మం, మియాపూర్, పికెట్, నిజామాబాద్ వంటి డిపోల నుంచ మొత్తం 24కు పైగా సర్వీసులు ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణికులకు సేవలను అందిస్తోన్నాయి.
వీటిల్లో సూపర్ లగ్జరీ, లహరి ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించింది. సూపర్ లగ్జరీలో ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలో 20 శాతం, లహరి ఏసీ బస్ సర్వీసుల్లో 25 శాతం మేర తగ్గించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఒక్కో టికెట్ మీద 100 నుంచి 150 రూపాయలకు పైగా తగ్గింపు లభిస్తుంది.
తమ అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in ద్వారా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications