చర్లపల్లి- కన్యాకుమారి ప్రత్యేక రైళ్లు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు: అరుణాచలం సహా అన్నీ కవర్
Special Trains from Charlapalli Railway Station: వేసవి సెలవుల్లో ఏర్పడే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. చర్లపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన తొలి రైలు పట్టాలెక్కనుంది.
చర్లపల్లి నుంచి..
దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏప్రిల్ 2 నుంచి జూన్ 25వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07230 ప్రత్యేక రైలు రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.

కన్యాకుమారి నుంచి..
తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి బయలుదేరే నంబర్ 07229 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11:40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
హాల్ట్ స్టేషన్లు ఇవే..
నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పడిరిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండగల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుధునగర్, సత్తూరు, కోవిల్పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్కోయిల్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
అరుణాచలం సహా..
ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ వల్ల అరుణాచలాన్ని దర్శించాలనుకునే భక్తులకు మంచి రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టయింది. అలాగే- చిదంబరేశ్వరుడిని దర్శించుకోవడానికీ ఉపయోగపడుతుంది. తంజావూరు, మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికీ వెసలుబాటు ఉంటుంది. అలాగే- వేసవిలో కొడైకెనాల్, ఊటీ వెళ్లాలనుకునే వారు కూడా ఈ ఎక్స్ప్రెస్ వల్ల లబ్దిపొందగలరు.
గ్లాస్ బ్రిడ్జి..
వేసవి సీజన్లో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో దక్షిణాన చిట్టచివరి ప్రాంతం కన్యాకుమారికి వెళ్లాలనుకునే వారికి శుభవార్త వినిపించింది తమిళనాడు ప్రభుత్వం. కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

జనవరిలో రిబ్బన్ కట్..
ఈ గ్లాస్ బ్రిడ్జిని కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కన్యాకుమారికి వెళ్లే పర్యాటకులు గ్లాస్ బ్రిడ్జిపై బంగాళాఖాతం అందాలను ఎంజాయ్ చేస్తోన్నారు.
37 కోట్లతో..
ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది.
తిరువళ్లువర్ విగ్రహం..
133 అడుగుల ఎత్తు ఉన్న తిరువళ్లువర్ విగ్రహాన్ని నెలకొల్పి 25 సంవత్సరాలవుతోంది. 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి దీన్ని ప్రారంభించారు. 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తిరువళ్లువర్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది.
సూర్యోదయాస్తమానాలను..
ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పర్యాటకులు తిరుగాడటానికి ఫెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని- పూంపుహార్ షిప్పింగ్ కంపెనీ నడిపిస్తోంది. ఇప్పుడిక గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇక దీనిపై నిల్చుని బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం- అరేబియా సముద్ర సంగమాన్ని, సూర్యోదయాస్తమానాలను తిలకించవచ్చు.












Click it and Unblock the Notifications