TSCET-2020:పరీక్షా తేదీ షెడ్యూలు వచ్చేసింది.. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్..!
హైదరాబాదు: కరోనావైరస్ విజృంభించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదాపడ్డాయి. అయితే కరోనాతో కలిసే జీవితం సాగించాల్సి వస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. కరోనాతో వాయిదా పడ్డ పలు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో జరగాల్సిన ఏడు కామన్ ఎంట్రెన్స్ సెట్ (TSCET)లకు సంబంధించి షెడ్యూలును విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యాశాఖ.
Recommended Video
ఆగష్టు 31 నుంచి అక్టోబర్ 4 వరకు
తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి షెడ్యూలును ఖరారు చేసింది. ఈ పరీక్షలు ఇటు తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతాయి. ఆగష్టు 31 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4వరకు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూలును విడుదల చేసింది. ఆగష్టు 31 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన తెలంగాణ ఉన్నత విద్యా శాఖ మండలి ఛైర్మెన్ పాపిరెడ్డి... ఈ పరీక్షలు అంతా ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం 3.74 లక్షల మంది అభ్యర్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టుకు హాజరు అవుతారని వెల్లడించారు.
షెడ్యూలు ఇలా ఉంది..
ఇదిలా ఉంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సమయంలో పరీక్ష రాసేందుకు ఏ జిల్లా అయితే ఎంపిక చేసుకున్నారో ఆ జిల్లాలోనే వారు పరీక్ష రాసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాపిరెడ్డి చెప్పారు. దీని వల్ల ఎక్కడున్న వారు అక్కడే ఉన్న పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరవుతారని దీనివల్ల ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇక రివైజ్ చేసిన షెడ్యూలు ప్రకారం:
TS EAMCET-2020 : సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. దీనికి 1,42,860 మంది విద్యార్థులు రెండు రాష్ట్రాల నుంచి హాజరు కానున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్లో 78,664 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సెప్టెంబర్ 28 మరియు 29వ తేదీల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
ఎక్కడ అప్లయ్ చేశారో అక్కడే పరీక్ష రాయొచ్చు
TS ECET-2020: ఆగష్టు 31న టీఎస్ ఈసెట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 28,038 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అదేమారిగా పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశం కోసం నిర్వహించే TSPGCET మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 21,748 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSICET-2020: సెప్టెంబర్ 30న రెండు సెషన్లలో టీఎస్ఐసెట్ పరీక్ష జరగనుండగా అక్టోబర్ 1వ తేదీ మాత్రం మధ్యాహ్నం వేళలో పరీక్ష జరుగుతుందని అధికారులు చెప్పారు. ఇక టీఎస్ ఐసెట్ -2020 పరీక్ష కోసం మొత్తం 55,578 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీఈడీ కోర్సు ప్రవేశం కోసం నిర్వహించే TS EDCET-2020 అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం మరియు అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం వేళల్లో జరుగుతుందని పాపిరెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 4వ తేదీన రెండు సెషన్లలో TSLAWCET-2020 పరీక్ష జరుగుతుందని ఉన్నత విద్యాశాఖ మండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు.