నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్.. ఎక్కడికక్కడ బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్లు
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ఆపై మోతే గ్రామం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు అడ్డంకులు సృష్టించకుండా ఉండటం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
జగిత్యాల కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే
ఇక నేడు సీఎం కేసీఆర్ పూర్తి పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లాకు పయనం కానున్నారు సీఎం కేసీఆర్. 12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత అధికారుల కార్యాలయంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 12 గంటల 40 నిమిషాలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఆపై ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.
జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
1.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నభోజనం చేయనున్నారు. 3 గంటల 10 నిమిషాలకు జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక సభానంతరం 4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు.
2లక్షల జనసమీకరణతో భారీ బహిరంగ సభ
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు ఐదు జిల్లాల నుండి రెండు లక్షల మంది జన సమీకరణతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న క్రమంతో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం 2325 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నేడు సీఎం కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో ఏం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేంద్రాన్ని పదేపదే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ జగిత్యాల కేంద్రంగా జరగనున్న సభలో కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్ లు, మండిపడుతున్న ప్రతిపక్షాలు
సభకు విఘాతం కలిగించకుండా బిజెపి, కాంగ్రెసు శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. వేములవాడకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు . దీంతో విపక్ష పార్టీల నాయకులు కెసిఆర్ ప్రభుత్వ పాలన పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు బుద్ధి చెబుతారని బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
డ్రగ్స్ బానిస.. నమూనాలిస్తే నిరూపిస్తా.. కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్