ఊహకు అందలేదు: సునామీని పసిగట్టింది ముందుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రమే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాతావరణశాఖలు పసఫిక్ మహాసముద్రంలో భూకంపం వస్తుందని ముందుగానే ప్రమాదఘంటికలు మోగించినా ఆ వెంటనే ఇండోనేషియాలోని పాలు నగరంపై సునామి విరుచుకుపడుతుందని మాత్రం శాస్త్రవేత్తలు ఊహించలేకపోయారు. ఈ సునీమీ కాటుకు కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ సునామీ ఎలా వచ్చిందో... అంతవరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అలజడికి గురై పగబట్టినట్లుగా విరుచుకుపడటం ఏమిటో ఇంకా శాస్త్రవేత్తలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.

భూకంపం హెచ్చరికలు ఇచ్చిన హైదరాబాద్ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్) సాధారణంగా సునామీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలను అలర్ట్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 28న భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాన్ని పసిగట్టింది. వెంటనే ఇండియన్ ఓసియన్ సమాఖ్యలో ఉన్న ఇండోనేషియాతో పాటు ఇతర అంతర్జాతీయ నెట్వర్కులను అప్రమత్తం చేశాయి. భూకంపం వస్తుందని మాత్రమే తమకు తెలుసునని ఇక సముద్రం అంచున జరుగుతున్న అలజడి గురించి ఎలాంటి సమాచారం లేదని ఆ సంస్థ డైరెక్టర్ షెనాయ్ తెలిపారు.

సునామీ హెచ్చరికలను వెనక్కు తీసుకున్నాం
ఇన్కాయిస్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పసఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5 నమోదు అయిన ఐదునిమిషాలకే ఇండోనేషియా సునామీ హెచ్చరిక కేంద్రం నుంచి సునామీ వచ్చే అవకాశాలున్నాయంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే మూడు హెచ్చరికల తర్వాత సునామీ భయం లేదని తెలిసి హెచ్చరికలను వెనక్కు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు కారణం సునామీ వచ్చే అవకాశాలున్నాయని ముందుగా భావించామని... కానీ సముద్ర గర్భంలో అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది కాబట్టే హెచ్చరికలను వెనక్కు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సునామీ పసిగట్టే పరికరాలు సైతం సూచనలు చేయలేదు
"పాలులో సంభవించిన సునామి చాలా వింతగా అనిపించింది. ఈతరహా సునామీ తొలిసారిగా చూస్తున్నాం. సునామీని పసిగట్టే పరికరాలు కూడా ఎలాంటి సునామీ పరిస్థితిని సూచించలేదు. ఓ చిన్న తీరం పైకి మాత్రమే పెద్ద అలలు వచ్చాయి. "అని చెప్పారు ఓసెన్ అబ్జర్వేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ గ్రూప్ ఛీఫ్ ఈ.పట్టాబిరామారావు తెలిపారు. ఇదిలా ఉంటే ఇన్కాయిస్ డైరెక్టర్ మాత్రం రెండు వేర్వేరు వివరణలు ఇచ్చారు. మహాసముద్రం గర్భం కింద మట్టిదిబ్బలు కూలి కొంత అలజడి జరిగి ఉండొచ్చని చెప్పారు. అదేసమయంలో భూకంపం రావడంతో ఓ చిన్నపాటి సునామీ ఏర్పడి ఉంటుందని చెప్పారు. ఇక భౌగోలిక స్వరూపం ఆధారంగా ఈ చిన్నపాటి సునామీ తీవ్ర రూపం దాల్చి తీరని నష్టాన్ని కలిగించిందని ఇన్కాయిస్ డైరెక్టర్ షెనాయ్ వివరించారు.












Click it and Unblock the Notifications