భారతీయ రైల్వేలో మరో నవశకం - తొలి కార్గో ఎక్స్ ప్రెస్ ప్రారంభం - హైదరాబాద్ టూ ఢిల్లీ...
హైదరాబాద్ : దశాబ్దాలుగా నత్త నడకన సాగుతున్న భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే అవకాశాన్ని కరోనా కల్పించింది. ఇన్నాళ్లూ స్టేషన్ దాటేందుకు జనాల్ని విసిగించే గూడ్స్ రైళ్లను చూసిన కళ్లతోనే ఎక్స్ప్రెస్ పరుగులు తీసే కార్గో సర్వీసులను చూసే అవకాశాన్ని రైల్వేలు కల్పించాయి. భారతీయ రైల్వేల చరిత్రలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే ఓ కార్గో ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్- న్యూఢిల్లీ స్టేషన్ల మధ్య ప్రారంభించింది. తొలుత ప్రయోగాత్మంగా నడిపి విజయవంతమైతే ఇక రెగ్యులర్ సర్వీసుగా దీన్ని నడిపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే రైల్వేల్లో కార్గో సేవల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
రైల్వేల్లో కరోనా తెచ్చిన మార్పు...
ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఒకరి బలాబలాలు తెలుస్తాయంటారు. వ్యక్తుల విషయంలో ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగిన భారతీయ రైల్వే మాత్రం కరోనా వచ్చాక భారీ మార్పులతో అదే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యల్ప వేగంతో ప్రయాణించే రైళ్లుగా పేరు తెచ్చుకున్న మన గూడ్స్ రైళ్ల వేగాన్ని అమాంతం పెంచడంతో పాటు వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తొలిసారిగా గుర్తించింది భారతీయ రైల్వే. దీంతో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు సైతం మన గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అంతటితో ఆగకుండా కార్గో రవాణాలో మరో చారిత్రక శకానికి దక్షిణ మధ్య రైల్వే తాజాగా తెరలేపింది.
తొలి కార్గో ఎక్స్ప్రెస్...
కరోనా వచ్చాకే గూడ్స్ రైళ్ల విలువేంటో భారతీయ రైల్వేకు తెలిసొచ్చింది. అంతకుముందు ప్రయాణికుల రైళ్లతో పోలిస్తే మెరుగైన ఆదాయ మార్గంగా మాత్రమే చూసిన గూడ్స్ రైళ్లు ఇప్పుడు రైల్వేకు సిరులు కురిపించే కల్పవృక్షాలుగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు ప్రయాణికుల ఆదాయానికి మించి కోట్ల ఆదాయం తెప్పించే అవకాశం ఉందని రైల్వే గుర్తించింది. ఇందుకు చక్కటి ఉదాహరణగా తాజాగా హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన తొలి గూడ్స్ రైలు. ఇప్పుడు అదే కోవలో తొలి కార్గో ఎక్స్ప్రెస్ రైలును కూడా దక్షిణ మధ్య రైల్వేనే ప్రారంభించింది. దేశంలో మిగతా రైల్వేలకు ఆదర్శంగా నిలుస్తూ తొలి ఎక్స్ప్రెస్ సరకు రవాణా రైలును అధికారులు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకూ ప్రయాణిస్తుంది.
ఆరునెలలు ప్రయోగాత్మకంగా..
గతంలో 20 కిలోమీటర్లు దాటడమే గగనంగా ఉన్న గూడ్స్ రైలు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచుతూ ప్రారంభించిన ఈ కార్గో ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లోని సనత్ నగర్ స్టేషన్ నుంచి బుధవారం బయలుదేరింది. ఇది శుక్రవారానికి న్యూఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్టేషన్కు చేరుకోనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి టైం టేబుల్డ్ గూడ్స్ రైలు కూడా. ఇది విజయవంతమైతే ఇలాంటి మరిన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగా దీన్ని నడపనున్నారు. ప్రస్తుతం రైల్వేలోని ఇతర జోన్లకూ ఇది ఆదర్శంగా నిలవబోతోంది. గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ సర్వీస్ లా నడపడం ద్వారా తక్కువ సమయంలో సరకు రవాణా సాధ్యం కావడంతో పాటు ఎక్కువ లగేజీని గమ్య స్ధానాలకు చేర్చే అవకాశం దక్కుతుంది.
Recommended Video
కరోనాతో పెరిగిన డిమాండ్
గతంలో దేశంలో పెద్ద పెద్ద సంస్ధలు మాత్రమే గూడ్స్ రైళ్ల సేవలను వాడుకునేవి. ఇప్పుడు కరోనా రాకతో రోడ్డు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది. రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కరోనా భయంతో రవాణా వ్యవస్ధ కుంటుపడింది. గతంతో పోలిస్తే చిన్న సంస్ధలు కూడా రైలు కార్గో రవాణాకు మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి పరిస్ధితిని ముందే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా కార్గో ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్గో ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా సాధారణ రోడ్డు రవాణా, రైల్వే పార్శిల్ ఛార్జీలతో పోలిస్తే 40 శాతం తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉన్నాయి. దీంతో కార్గో ఎక్స్ప్రెస్ సేవలను వాడుకోవాలని వినియోగదారులకు దక్షిణమధ్య రైల్వే పిలుపునిస్తోంది.