సికింద్రాబాద్ విధ్వంసం కేసు: ఇరికించారు, బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు సుబ్బారావు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. అయితే, ఈ అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు చెబుతున్నారు.
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఏ64గా సుబ్బారావు
పోలీసులు అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారని సుబ్బారావు ఆరోపించారు. ఆర్మీలో పనిచేసిన తాను.. యువతను సైన్యంలో చేరేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సుబ్బారావు పిటిషన్లో తెలిపారు. అయితే, యువతను విధ్వంసానికి ప్రోత్సమించారనే ఆరోపణలతో ఈ కేసులో సుబ్బారావును పోలీసులు నిందితుడిగా (ఏ64)గా పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల క్రితం సుబ్బారావుతోపాటు అతని అనుచరులు శివ, మల్లారెడ్డి, బీసీ రెడ్డిలను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో సుబ్బారావు ప్రధాన కుట్రదారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
దురుద్దేశంతోనే యువకులను రెచ్చగొట్టిన సుబ్బారావు
అయితే, నర్సింగ్ అసిస్టెంట్గా ఆర్మీలో పనిచేసిన సుబ్బారావు.. 2011లో పదవీ విరమణ పొందాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 2014లో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి.. ఆర్మీ ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలన్నీ నష్టపోతాయనే దురుద్దేశంతోనే.. సుబ్బారావు యువకులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చేయించాడని పోలీసులు ఎప్ఐఆర్లో పేర్కొన్నారు.
సికింద్రాబాద్ విధ్వంసంతో సంబంధం లేదంటూ సుబ్బారావు
ఈ నేపథ్యంలోనే సుబ్బారావు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసానికి తనకు సంబంధం లేదని, తనను అన్యాయంగా పోలీసులు ఈ కేసులో ఇరికించారని సుబ్బారావు ఆరోపిస్తున్నారు. కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో సుమారు 5వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు సమాచారం. అయితే, కొందరు మాత్రం రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఓ రైలుకు నిప్పంటించి తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు గాయాలపాలయ్యారు.