సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఎయిర్ పోర్ట్ సైతం దిగదుడుపే: బోర్డు ఛైర్మన్ తనిఖీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. మొత్తం 10 ప్లాట్ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 180 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. రోజూ సగటున లక్షన్నర మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించిన ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఉండేది సికింద్రాబాద్లోనే.
వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తోన్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ఫామ్ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తోన్నారు. ఆధునికీకరిస్తోన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.

ఈ పునరాభివృద్ధి పనులను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని దక్షిణ మధ్య రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల వేగం, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించేందుకు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో భాగంగా సతీష్ కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ భాగం ప్రవేశ ద్వారం వద్ద సాగుతున్న పనులను తిలకించారు. కొత్తగా ఆధునీకరిస్తున్న స్టేషన్ ముఖద్వారం (ఫాసాడ్)తో పాటు మొదటి, రెండో అంతస్తుల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు. రైల్వే స్టేషన్కు వచ్చే వాహనాల పార్కింగ్ ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నిర్మిస్తున్న అత్యాధునిక అండర్గ్రౌండ్ పార్కింగ్ సదుపాయాన్ని పరిశీలించారు.
భవిష్యత్తులో ప్రయాణికులకు అంతర్జాతీయ విమానాశ్రయం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఇక్కడి వసతులను రూపకల్పన చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ప్రత్యేక మార్గాలు, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, అత్యాధునిక ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఈ పనుల క్రమం ఎక్కడా ఆలస్యం కాకుండా సమాంతరంగా సాగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సతీష్ కుమార్ సూచించారు.
ఈ సమీక్షలో ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్తో పాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన పలువురు సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. పనులు జరుగుతున్న తీరును, ఇప్పటివరకు సాధించిన పురోగతిని మ్యాప్ల రూపంలో వారు బోర్డు చైర్మన్కు వివరించారు. ఈ స్టేషన్ ముఖచిత్రాన్ని మార్చే విధంగా చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న విధంగా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications