సికింద్రాబాద్ అల్లర్లు: సాయి అకాడమీలో కేంద్ర ఇంటెలీజెన్స్, ఐటీ అధికారులు సోదాలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరించారు.
నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంత మంది ఆర్మీకి ఎంపికయ్యారు? అభ్యర్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేసేవారు? పన్నులు కడుతున్నారా? లేదా వంటి ఇతరత్రా లావాదేవీలు, శిక్షణకు సంబంధించిన వివరాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కాగా, సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరలయ్యాయి. దీంతో సికింద్రాబాద్ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో జూన్ 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసరావుపేటకు తరలించి 3 రోజులుగా విచారిస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లోని సాయి డిఫెన్స్ అకాడమీల్లోనూ సోదాలు చేసే అవకాశం ఉంది. సాయి డిఫెన్స్ అకాడమీల్లోని మేనేజర్లను విద్యార్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని మరో 6 డిఫెన్స్ అకాడమీలు కూడా అల్లర్లకు కుట్రపన్నాయని తెలిసింది. దీంతో వీటిపైనా పోలీసులు, అధికారులు దృష్టి సారించారు.
కాగా, వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసాత్మకంగా ఘటనలకు పాల్పడినట్లు తేల్చిన విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు.