అమిత్ షా సభలో టీఆర్ఎస్ నేత కలకలం - కారు ధ్వంసం: విచారణకు ఆదేశం..!!
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాళ నిర్వహించిన కార్యక్రమాలు పోటాపోటీగా సాగాయి. ఆధిపత్య పోరు మొదలైనట్టే కనిపించింది. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని చాటుకోవడానికి ఇవ్వాళ్టి కార్యక్రమాలు వేదికగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా..
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక మంత్రి బీ శ్రీరాములు దీనికి హాజరయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలుత- అమిత్ షా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాళ జాతీయ సమైక్యత దినోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ ఉదయం పబ్లిక్ గార్డెన్స్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గన్ పార్క్లో అమర వీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం లోయర్ ట్యాంక్బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంజారాహిల్స్లో కొత్తగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను ఆయన ప్రారంభించాల్సి ఉంది.
టీఆర్ఎస్ నేత కలకలం..
కాగా- అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో అధికార టీఆర్ఎస్కు చెందిన గోసుల శ్రీనివాస్ ఉదంతం కలకలం రేపింది. భద్రత సిబ్బందిని పరుగులు పెట్టించింది. అమిత్ షా కార్యక్రమానికి హాజరైన అశ్విక దళం పరేడ్ సమీపంలో ఆయన తన కారును పార్క్ చేశారు. అక్కడ వాహనాలను నిలపడానికి అనుమతి లేదు. దీన్ని గమనించిన భద్రత సిబ్బంది దాన్ని తొలగించారు. ఈ క్రమంలో కారు వెనుక వైపు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
విచారణకు ఆదేశం..
ఈ ఉదంతంపై అధికారులు విచారణకు ఆదేశించారు. గోసుల శ్రీనివాస్ను ప్రశ్నించగా.. తాను ఉద్దేశపూరకంగా కారును అడ్డుగా పెట్టలేదని వివరణ ఇచ్చారు. అమిత్ షా కార్యక్రమం నడుస్తోన్నందున హడావుడిగా తాను అక్కడ కారును నిలిపానని చెప్పారు. అంతేగానీ ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కారును అధికారులు ధ్వంసం చేశారని, అయినా తాను దీని గురించి ప్రశ్నించదలచుకోలేదని గోసుల శ్రీనివాస్ చెప్పారు.