సరదాగా గుట్టపైకి వెళ్లిన జంట.. అంతలోనే ఘోరం...
పిక్నిక్ కు వెళ్లిన ఓ జంట సరదాగా ఓ గుట్టపైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయింది. హిమాయత్ సాగర్ పీరం చెరువు గ్రామ గుట్టల్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: పిక్నిక్ కు వెళ్లిన ఓ జంట సరదాగా ఓ గుట్టపైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయింది. హిమాయత్ సాగర్ పీరం చెరువు గ్రామ గుట్టల్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మెహిదీపట్నంకు చెందిన నాగరాజు(25), నిజామాబాద్కు చెందిన ప్రియాంక(23)లు భార్యాభర్తలు. వీరు నార్సింగి ప్రాంతంలోని డిమార్ట్లో పనిచేస్తున్నారు. మంగళవారం వీరితో పాటు మరో జంట హిమాయత్సాగర్కు పిక్నిక్కు వెళ్లారు.
బండ్లగూడ లోని కాళీ ఆలయాన్ని దర్శించి, అక్కడ పూజలు నిర్వహించిన తరువాత సరదాగా బయటతిరిగేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా పీరంచెరువు గ్రామంలోని గుట్టలలో సెల్ఫీలు దిగేందుకు వెళ్లారు. అక్కడ నాగరాజు, ప్రియాంకలు సెల్ఫీలు దిగుతుండగా అనూహ్యంగా ప్రియాంక కాలుజారి బండపై నుంచి పడిపోయింది.
ఆమె నడుంకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108లో వాహనంలో షాదాన్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు. ఆమెతో పాటే పట్టు కోల్పోయి నాగరాజు కూడా కింద పడిపోవడంతో అతడికీ స్వల్ప గాయాలయ్యాయి.