అమెరికాలో ప్రేయసి హత్య: ఏడేళ్లు మారుపేరుతో హైదరాబాద్లో మకాం
హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి ఏడేళ్ల పాటు మారుపేరుతో హైదరాబాదులో మకాం వేసి ఓ ఇండో అమెరికన్ ఉదంతం ఇటీవలే వెలుగు చూసింది. టెక్సాస్లో ప్రియురాలిని హత్య చేసిన కేసులో అతనికి 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికాలో మాయచేసి నకిలీ వీసాతో పారిపోయి హైదరాబాదు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఏడేళ్ల పాటు హైదరాబాదులో మకాం వేశాడు.
ముద్దమల్లె అమిత్ లివింగ్ స్టన్ అనే ఆ ఖైదీ హైదరాబాదులో సంజయ్ కుమార్ పేరుతో చెలామణి అవుతూ వచ్చాడు. సంజయ్ కుమార్ అనే పేరుతో సికింద్రాబాదులోని ఓ అవుట్ సోర్సింగ్ కంపెనీలో మెడికల్ ట్రాన్సిక్పిప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. 23 ఏళ్ల శిక్షను అనుభవించడానికి భారత్ గతవారం అతన్ని అమెరికాకు అప్పగించింది.
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం పొందిన కేసులో అతను హైదరాబాదు పోలీసులకు చిక్కాడు. దాంతో ఏడాది పాటు చర్లపల్లి జైలులో ఉన్నాడు. ముద్దమల్లే అమిత్ సింగ్ అనే 47 ఏళ్ల ఆ నేరస్థుడు అమెరికాలోని టెక్సాస్లో మెడికల్ బిల్లింగ్ నిపుణుడిగా పనిచేసేవాడు. అతని తండ్రి ముద్దమల్లే లివింగ్ స్టన్ గతంలో హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్య చదివారు.
టెక్సాస్లో ఉంటున్న సమయంలో అమిత్కు పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న హెర్మిల్లా హైర్నాండెజ్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంత కాలం తర్వాత విడిపోతానని హెర్నాండెజ్ చెప్పింది. దాంతో అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షతో 2005 సెప్టెంబర్ 30వ తేదీన ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. మృతదేహాన్ని బీచ్లో పడేయడంతో అక్టోబర్ 4వ తేదీన కనిపెట్టారు.

ఈ కేసులో నేరం రుజువు కావడంతో 2007 ఫిబ్రవరి 13వ తేదీన అమిత్కు 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అబెల్ లిమాన్ తీర్పు చెప్పారు. అయితే, ఇందులో అతను ఏదో విధంగా బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్పోర్టుతో హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. లంచం తీసుకుని అతనికి బెయిల్ ఇచ్చిన కేసులో న్యాయమూర్తులు లిమాన్, అప్పటి డిస్ట్రిక్ట్ అటార్నీ అర్నాండోలకు 21 ఏళ్ల పాటు శిక్ష పడింది.
హైదరాబాదు వచ్చిన తర్వాత తరుచుగా మకాం మారుస్తూ చివరకు 2010 నుంచి సైనిక్పురి మాధవిపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉంటూ వచ్చాడు. సికింద్రాబాదులోని ప్యారడైజ్ సమీపంలోని ఓ సంస్థకు మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్టుగా పని చేస్తూ తనకు ఇచ్చిన ల్యాప్టాప్తో పని చేస్తూ వచ్చాడు.
సంజయ్ కుమార్ పేరుతో నకిలీ పాన్కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అయితే, ఎక్కువగా అతను ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. దాంతో అనుమానం వచ్చి స్థానికులు నిరుడు కుషాయిగుడా పోలీసులకు సమాచారం అందించారు.
అతని వ్యవహార శైలిని కొంత కాలం పాటు ఇన్స్పెక్టర్ ప్రతాప్ కుమార్ జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చారు. నకిలీ ధ్రువపత్రాల నిరుడు మే 11వ తేదీన అమిత్ను అరెస్టు చేశారు. ఆ కేసులో అతనికి ఏడాది శిక్ష పడింది. అప్పటికే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయి ఉంది. గత సోమవారం అతన్ని అమెరికాకు అప్పగించారు.












Click it and Unblock the Notifications