అనుమానం: నయీంను పట్టుకొచ్చి కాల్చి చంపారా?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పోలీసులు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో కాల్చి చంపారా? కావచ్చునని అంటున్నారు తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ. నయీం కేసు విచారణ తీరు చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని, కేసును రోజురోజుకూ నీరుగా ర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
నయీంను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కాల్చి చంపినట్లు సమాచారం అందుతోందని అన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. సిట్ చెబుతున్న రూ.2.85 కోట్లకు మించి నయీం ఇంట్లో డబ్బు ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే డాక్యుమెంట్లను కాల్చివేస్తున్నట్లు తెలుస్తోందని, పెద్ద తలకాయల ప్రమేయమున్న ఈ కేసును సిట్కు అప్పగించడం సరి కాదని అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తల పేర్లు ఈ కేసులో ఇమిడి ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరగకుంటే అనేక కేసుల్లానే ఇదీ నీరుగారిపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో సీఐడీ దర్యాప్తు చేసినహౌసింగ్ స్కామ్లో ఏ విషయాలు తేలలేదని, ఓటుకు నోటు వ్యవహారంలోనూ ఏసీబీ పురోగతి సాధించలేదని అన్నారు.
నిన్న మొన్నటి ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఉందని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. అన్నింటికన్నా ముఖ్యంగా నయీముద్దీన్ ఎన్కౌంటర్కు, సొహ్రాబుద్దీన్ కేసుకు సంబంధం ఉందని అనుమానం కలుగుతోందని చెప్పారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు.
ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు కోర్టు విముక్తి కల్పించిందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఈ ఎన్కౌంటర్ జరగడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ అవసరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.