షర్మిల వర్సస్ పవన్ - బీజేపీకి కావాల్సిందెవరు : ఢిల్లీ నేతల లెక్క పక్కా..!!
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా నిలబడేదెవరు. షర్మిల - పవన్ కల్యాణ్. ఈ ఇద్దరితో ఎవరితో తెలంగాణలో ప్రయోజనం. ఇప్పుడు ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ నేతలు పక్కా లెక్కతో ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న షర్మిల ఎపిసోడ్ తో ప్రధాని సహా బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోది. కానీ, తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని షర్మిల చెబుతోంది. ఇప్పుడు సడన్ గా తెలంగాణ రాజకీయ రంగంలోకి పవన్ దిగుతున్నారు. తాజాగా 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది.

షర్మిల వైపు టర్న్ తీసుకున్న టీ- రాజకీయం
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసినా రాని మైలేజ్ - గుర్తింపు హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఒకే ఘటనతో వచ్చింది. ఇప్పటికీ దీనికి కొనసాగింపుగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ షర్మిల పాదయాత్రకు అనుమతి దక్కలేదు. ఇక, ఈ సమయంలోనే షర్మిలకు బీజేపీ ఉన్న సంబంధాల పైన చర్చ మొదలైంది. ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేసారని.. షర్మిల థాంక్స్ చెప్పటం ద్వారా నిర్దారణ అయింది. అదే విధంగా షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటి వరకు షర్మిలకు వ్యతిరేకంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. షర్మిల మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తనను వేధిస్తోందనే అభిప్రాయంతో ఉన్న షర్మిల కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల బరిలోనే జనసేనాని..
ఇటు ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అటు తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతోంది. 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించింది. అయితే, తెలంగాణలో బీజేపీతో పొత్తు పైన డైలమా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు జనసేన పోటీ చేయలేదు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జనసేన పోటీకి దూరంగా ఉంది. అదే సమయంలో బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. రెండేళ్ల క్రితమే పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి కాదని.. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీకి మద్దతు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం పవన్ తో పాత్తు తెలంగాణలో ఉండదని.. కేవలం ఏపీకి పరిమితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు.

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా - బీజేపీ ఢిల్లీ నేతల లెక్క
ఇక, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ -టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పైన పోరాటం చేసే వారికి కలుపుపోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు కలిసి వస్తుందని గులాబీ పార్టీ నేతల అంచనా. ఇదే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనేది బీజేపీ ఆలోచన. అందులో భాగంగానే షర్మిల వ్యవహారంలో అటు బీజేపీ..ఇటు టీఆర్ఎస్ తమ రాజకీయాలకు పదును పెట్టాయి. ఇక, ఇప్పుడు పవన్ తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించటంతో.. తెలంగాణలో ఎవరి బలం ఎంత... ఎవరు ఎన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు.. ఎవరికి ఏ వర్గం అండగా నిలుస్తుంది.. ఇద్దరిలో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనే లెక్కలపై బీజేపీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎంపిక చేసుకున్న వారితో పొత్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. పవన్ తో కలిసి వెళ్లాలనుకుంటే అటు ఏపీలో ఇప్పటికే మైత్రి ఉండటంతో..తెలంగాణలోనూ సమస్య కాదు. షర్మిలను ఆహ్వానిస్తే..పొత్తు అంశం పైన షర్మిల నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో, ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆలోచన పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications