కెసిఆర్ చెప్పిన విచిత్ర విషయం: ఆమె 11 కాలేజీల్లో ప్రొఫెసర్, లక్ష రూపాయలు...
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితిపై కెసిఆర్ విచిత్రమైన విషయం చెప్పారు. ఓ మహిళ 11 కాలేజీల్లో ప్రొఫెసర్ బాధ్యతలు నిర్వహిస్తోందని చెప్పారు.
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓ విచిత్రమైన విషయం చెప్పారు. ఓ మహిళ ఏకంగా 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రోఫెసర్ బాధ్యతలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇదు నిజమా అని అని తనిఖీకి వచ్చిన అధికారులు ఫోన్ చేస్తే అవునని ఆమె సమాధానం చెబుతుందని, అలా సమాధానం చెప్పినందుకు ఆమెకు లక్ష రూపాయలు ముట్ట చెబుతారని ఆయన వివరించారు.
ఏ విధమైన నాణ్యత లేకుండా కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొన్ని కాలేజీలను నడిపిస్తున్నారని, తనిఖీలకు వెళ్లినా పట్టుపడకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు. శైలజా రామయ్యర్ సాంకేతిక విద్యా శాఖ కమీషనర్గా ఉన్నప్పుడు 11 ఇంజనీరింగ్ కాలేజీల ప్రోఫెసర్ సంగతి బయటపడిందని చెప్పారు.
హైదరాబాద్లోని 11 కాలేజీల్లో పని చేస్తుంటే, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి కారులో వెళతారు అనుకుంటే అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 11 కాలేజీల్లో పని చేస్తున్నట్టు రికార్డుల్లో చూపారని చెప్పారు. జెఎన్టియు నుంచి ఫోన్ వస్తే ఔను పని చేస్తున్నానని చెబితే చాలునని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు నడిపేందుకు బ్రోకర్ల వ్యవస్థ ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
రీయింబర్స్మెంట్ బకాయిలను మార్చి 31లోగా చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం శాసన సభలో ప్రకటించారు. ఏ సంవత్సరం ఫీజు ఆ సంవత్సరం చెల్లించడం సాధ్యం కాదని, ఈ పథకం రూపకల్పనే అలా ఉందని చెప్పారు. నిరుడు బకాయిలు ఆర్థిక సంవత్సరం చివరలో చెల్లించడం మొదటినుంచి వస్తున్నదేనని, ఇప్పుడు కూడా అదేవిధంగా చెల్లించనున్నట్టు చెప్పారు.
ప్రశ్నోత్తరాల తరువాత వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కెసిఆర్ మాట్లాడుతూ మార్చి 31 నాటికి 2015-16 బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు. అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 2010-11లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచే బకాయిలు ఉంటూ వస్తున్నాయని, తెలంగాణ ఆవిర్భావం నాటికి 1880 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వివరించారు. ఈ పథకం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకంలో మార్పులు చేసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.