మీకే కాదు.. మాక్కూడా ఓ బుక్ ఉంది
తెలంగాణ కొత్త పోలీస్ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం లక్డీకపూల్ కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ భగవత్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.
తెలంగాణలో ఇటీవల సంభవించిన సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో శివధర్ రెడ్డి.. కొత్త డీజీపీగా అపాయింట్ అయిన విషయం తెలిసిందే. విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పోలీసులకు ఇదొక స్టాండర్డ్ ప్రొటోకాల్ అని గుర్తు చేశారు. అంతర్గతంగా ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని సూచించారు.

అలాగే- పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని శివధర్ రెడ్డి తెలిపారు. చాలినంత మంది పోలీసులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల అమలు మరింత మెరుగుపడుతుందని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపైనా కొంత వరకు ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి శివధర్ రెడ్డి మాట్లాడారు. దీనికి తాము సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికలను గ్రామస్థాయిలో సజావుగా నిర్వహించడానికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తమకు బలమైన పోలీస్ నెట్ వర్క్ ఉందని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తామని అన్నారు.
మావోయిస్టు కదలికల గురించీ శివధర్ రెడ్డి ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో మావోయిస్టు నాయకులు సాయుధ పోరాట మార్గాన్ని విడిచిపెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తోన్నారని, లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా సహాయక సహకారాలను అందిస్తామని అన్నారు. మావోయిస్టుల సిద్ధాంతం ఆచరణలో విఫలమైందని చెప్పారు. ఆధునికీకరణ, పోలీసు చర్యలతో పాటు పునరావాస కల్పన ద్వారా తీవ్రవాదాన్ని ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాకూ శివధర్ రెడ్డి హెచ్చరికలు చేశారు. నిర్మాణాత్మక, సద్విమర్శలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. కట్టుబాట్లు దాటి, హద్దులు మీరి ప్రవర్తించితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ వార్తలు వ్యాప్తి చేసే వారినీ వదలిపెట్టబోమని చెప్పారు. వేరొకరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తప్పకుండా చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
తమకు పింక్, బ్లూ, రెడ్ బుక్ వంటివేవీ ఉండవని, తెలిసిందంతా ఖాకీ బుక్ మాత్రమేనని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఖాకీ బుక్ లో సీఆర్పీసీ, బీఎన్ఎస్, చట్టాల గురించి ఉంటుందని, తాము దానినే అనుసరిస్తామని పేర్కొన్నారు. మిగతా బుక్ లతో తమకు సంబంధం ఉండబోదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications