రూ.33 కోట్లు చెల్లించాల్సిందే: డీకే అరుణ భర్తకు షాక్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరత సింహా రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో బుధవారం చుక్కెదురైంది. మహబూబ్నగర్లోని ఆయన క్వారీల పైన న్యాయస్థానం స్టే విధించింది.
గతంలో ఆయన చెల్లించాల్సిన 33 కోట్ల రూపాయల జరిమానాను కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. జరిమానా వసూలు చేసే విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. రూ.33 కోట్లను మీరు వసూలు చేస్తారా లేక మమ్మల్ని వసూలు చేయమంటారా అని అధికారులను ప్రశ్నించింది. కాగా, వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలన్న భరత సింహారెడ్డి కుటుంబ సభ్యుల పిటిషన్ను కోర్టు గతంలో తోసిపుచ్చింది.
హైకోర్టు విభజనపై తీర్పుని నిలిపి ఉంచిన కోర్టు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, ప్రతివాదులు సమర్పించారు. హైకోర్టు విభజనపై తీర్పును హైకోర్టు నిలిపి ఉంచింది.
వరంగల్-ఖమ్మం రైల్వే విద్యుత్ లైనులో సాంకేతిక లోపం
వరంగల్-ఖమ్మం రైల్వే విద్యుత్ లైనులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెక్కొండ - వెలుగూరు రంగం పేట వద్ద బుధవారం ఓహెచ్ విద్యుత్ వైర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా అధికారులు పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
విద్యుత్ లైనులో సాంకేతికలోపం కారణంగా మహబూబాద్లో శాతవాహన, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నెక్కొండలో సింహపురి ఎక్స్ప్రెస్ రైలు, కేసముద్రం దగ్గర తమిళనాడు ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక లోపం తలెత్తిన విద్యుత్ లైనును పునరుద్ధరిస్తున్నారు.












Click it and Unblock the Notifications