గో బ్యాక్: కెసిఆర్ ఊళ్లో హరీష్కు షాక్, ఎమ్మెల్యేను బుజ్జగించిన జూపల్లి
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వగ్రామం మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో మంత్రి హరీష్ రావుకు చుక్కెదురయింది. చింతమడక గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హరీష్ రావు శనివారం వచ్చారు.
ఈ సందర్భంగా హరీష్ రావుకు ఓ వర్గం నుంచి నిరసన ఎదురైంది. మరో వర్గం నుంచి స్వాగతం లభించింది. చింతమండక గ్రామాన్ని యునైటెడ్ ఇండియా బీమా కంపెనీ దత్తత తీసుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుర్చీలు, బల్లలు, బీరువాలు, ఇతర సామాగ్రి అందించేందుకు సిద్ధమైంది.
ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ మాజీ సర్పించి ఆధ్వర్యంలో సిద్దిపేట - చింతమండక మార్గంలో బైఠాయించి హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ హరీష్ రావు అన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీనివాస్ గౌడ్ను సముదాయించిన జూపల్లి
స్వాతంత్య్ర వేడుకల్లో అధికారులు అవమానపరిచేలా వ్యవహరించారని ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రలోనే గుర్తింపు ఉండేదని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
శనివారం 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు జెడ్పీ చైర్మన్తోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పతాక ఆవిష్కరణ తర్వాత భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు గంటపాటు ప్రసంగించారు.
వేదిక పక్కన శిబిరంలో స్వాతంత్య్ర సమరయోధుల సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ శ్రీదేవి, జేసీ రాంకిషన్తో కలిసి మంత్రి జూపల్లి వెళ్లారు. తమను ఆహ్వానించకపోవడంతో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు మనస్తాపానికి గురయ్యారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించిన తర్వాత ఎమ్మెల్యేలను రావాలని మంత్రి జూపల్లి కోరారు. గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు ఆయన మాటలను ఖాతరు చేయలేదు. దీనిపై వారు ఆవేదన చెందారు.
అనంతరం, అలక వహించిన ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ను శనివారం సాయంత్రం ఆర్ అండ్ బీ అతిథి గృహానికి పిలిపించుకుని మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవి, జేసీ రాంకిషన్ చర్చలు జరిపారు.
తహసీల్దార్ల బదిలీ వ్యవహారంలో మాటమాత్రమైనా జిల్లా అధికారులు తమను సంప్రదించలేదని, పాలనాపరమైన వ్యవహారాల్లో కూడా ఖాతరు చేయడం లేదని ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఇకపై పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను మంత్రి జూపల్లి సముదాయించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications