43 గంటల నరకయాతన: షోడరాజును కాపాడిన అధికారులు, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో వేటకు వెళ్లి సింగరాయిపల్లి గుహ బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుని దాదాపు రెండు రోజులపాటు నరకయాతన అనుభవించిన షాడరాజును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. పోలీసు, అటవీశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖల అధికారులు సుదీర్ఘంగా శ్రమించి అతడ్ని కాపాడారు.
బయటికి తీసిన అనంతరం రాజును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన శరీరంపై పలు గాయాలు ఉన్నాయి. రాజును సురక్షితంగా బయటికి తీసిన అధికారులు, సిబ్బందికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు వివరాలు ఇలా..
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడరాజు అతని స్నేహితుడితో కలిసి మంగళవారం సాయంత్రం వేటకు వెళ్లాడు. షాడరాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం ఇరుక్కుపోగా.. బుధవారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే బండరాళ్లను కొంతమేర తొలిచేశారు.
సుమారు 43 గంటలకుపైగా వేలాడుతూ షాడరాజు నరకయాతన అనుభవించాడు. అతడు తినేందుకు పండ్లు, నీరు అందించారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇంఛార్జీ తహసీల్దార్ సాయిలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, వేటకు వెళ్లిన కారణంగా రాళ్ల మధ్య షోడరాజు ఇరుక్కున్న విషయాన్ని అతని స్నేహితుడు అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేదు. దీంతో అతడి రెస్క్యూ మరింత ఆలస్యమైంది.