ప్రియురాలిని చీట్ చేసిన ఎస్సై అరెస్ట్
కరీంనగర్/వరంగల్: ప్రేమ పేరుతో ఓ యువతిని ఎస్సై మోసం చేసిన సంఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో జరిగింది. న్యాయం చేయాలంటూ ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం... శాయంపేట మండల కేంద్రానికి చెందిన ప్రేమలీల కేయూలో ఎంఎస్సీ చదువుకునే రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన రాజు ప్రేమిస్తున్నానని నిత్యం క్యాంపస్కు వచ్చేవాడు.
అప్పట్లో రాజు వరంగల్లో స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు పేర్కొంది. 2006వ సంవత్సరంలో ప్రేమలేఖలు రాస్తూ ఇబ్బంది పెట్టేవాడని, తను చదువుకోవాలని బతిమిలాడిన క్రమంలో నువ్వు ప్రేమించేంత వరకు ఓర్పుతో ఉంటానని నమ్మించాడని పేర్కొంది.
2008లో మరో అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయగా, ఖాజీపేట పోలీస్ స్టేషన్లో కేసు కాగా జైలుకు వెళ్లినట్లు పేర్కొంది. బెయిల్ విషయంలో కుటుంబ సభ్యులతో పాటు తానూ సహకరించానని, ఈ క్రమంలో రాజు మంచితనాన్ని చూసి ప్రేమను స్వాగతించానని తెలిపింది.
తనను పెళ్లిచేసుకోవాలని కోరగా, ఎస్సైగా ఎంపికైన తర్వాత చేసుకుంటానని నమ్మించినట్లు తెలిపింది. కోచింగ్ కోసం 25వేల రూపాయల పంపించానని పేర్కొంది. తీరా ఎస్సైగా ఎంపికైన తర్వాత ప్రేమను తల్లిదండ్రులకు తెలియజేయగా వారు ఒప్పుకున్నట్లు తెలిపింది.
అనంతరం కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఫోన్ చేయడం మానేశాడని, తన కుటుంబ సభ్యులు పెళ్లి విషయం అడగ్గా, ఇష్టంలేదని తెలిపినట్లు చెప్పింది.
తానూ మానకొండూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అడగ్గా, స్వగ్రామానికి వచ్చి మాట్లాడుతానని చెప్పి, పెద్దలను మభ్య పెట్టి భయభ్రాంతులకు గురి చేశాడని, తనను మోసం చేసిన రాజుపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. ఇదిలా ఉండగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.