ఆ ఎస్సై కడప జిల్లా వాసి: ఇటీవలే సస్పెండ్ చేసినా.., 2004లోనూ
దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యపై అంశంపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
సిద్దిపేట: దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యపై అంశంపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. 2004లోను అతను అవినీతి కారణాలతో సస్పెండ్ అయ్యాడని, తాజా సస్పెన్షన్కు సంబంధించి అతను ఇంకా ఉత్తర్వులు తీసుకోలేదని చెప్పారు.
భార్యను కాల్చి చంపి, ఎస్సై ఆత్మహత్య: అధికారుల వేధింపులా, కొడుకు పెళ్లా?
దుబ్బాక ఎస్సై చిట్టిబాబు శుక్రవారం మధ్యాహ్నం సర్వీస్ రివాల్వర్తో తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అతను సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. చిట్టిబాబు స్వస్థలం కడప జిల్లా. అతనికి కొడుకు, కూతురు ఉన్నారు.
మధ్యాహ్నం..
దీనిపై ఓ టీవీ ఛానల్ అడగగా... సీపీ శివకుమార్ మాట్లాడారు. ఈ రోజు మధ్యాహ్నం దుబ్బాక పోలీస్ క్వార్టర్సులో ఒంటిగంట సమయంలో చిట్టిబాబు తన భార్యను కాల్చి, అతను కాల్చుకున్నాడని తెలిపారు.
దర్యాఫ్తుకు ఆదేశిస్తాం
దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేయిస్తామని చెప్పారు. ఉన్నతాధికారితో దర్యాఫ్తుకు ఆదేశిస్తామన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
సస్పెన్షన్ చేశాం కానీ..
అతనిని ఇటీవలే అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశామని చెప్పారు. అయితే అతను ఇప్పటి దాకా సస్పెన్షన్ ఆర్డర్ తీసుకోలేదని చెప్పారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ వెళ్తామంటే పంపించామని, తిరిగి వచ్చాడన్నారు.
పూర్తి దర్యాఫ్తు తర్వాతే..
పూర్తి దర్యాఫ్తు చేశాక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. కొడుకు బలవంతపు పెళ్లి గురించి, ఆయన కుటుంబం కలహాల గురించి ఇంకా పూర్తిగా తెలియదని, అలాంటప్పుడు మాట్లాడటం సరికాదని, అన్నీ విచారణ జరుపుతామని తెలిపారు.