సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి 22న నోటిఫికేషన్: 1000 మందికి వారసత్వ ఉద్యోగాలు
సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. సింగరేణిలో 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎండీ బలరామ్ తెలిపారు. కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమాపై గురువారం యూనియన్ బ్యాంక్ ఇండియాతో ఒప్పందం జరగనుందని చెప్పారు. సింగరేణి డైరెక్టర్లతో సమావేశమై వివిధ అంశాలపై ఆయన చర్చించారు.
మరోవైపు, సింగరేణి అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్భందీగా ఉండాలని సూచించారు.

ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన మిగిలిన సోలార్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు.
సింగరేణి ఉద్యోగులు, అధికారుల సౌకర్యార్ధం హైదరాబాద్లో సింగరేణి అతిథి గృహం నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సహకారం అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని డిప్యటీ సీఎం ఆదేశించారు .












Click it and Unblock the Notifications