శిరీష కేసులో పోలీసుల యూటర్న్!?: రాజీవ్ పదేపదే అదే చెబుతున్నాడు, హత్యేనంటున్న మేనమామ!
విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో చిత్రీకరణ జరుపుతున్నట్లు చెబుతున్నారు. మంగళవారం వీరిద్దరిని కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ..
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ఆమెది ఆత్మహత్య అని నిర్దారించిన పోలీసులు.. ఇప్పుడు హత్యా? అన్న కోణంలో కేసు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులు రాజీవ్, శ్రవణ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.
కస్టడీకి మంగళవారం చివరి రోజు కావడంతో.. కీలక విషయాలు రాబట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజీవ్, శ్రవణ్లు ఇద్దరిని.. వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. వేర్వేరు విచారణ ద్వారా ఇద్దరు చెబుతున్న విషయాలను సరిపోల్చనున్నారు. సోమవారం రాత్రి కూడా వీరిద్దరిని కలవనీలయలేదని తెలుస్తోంది. సోమవారం ఎక్కువగా రాజీవ్నే విచారించిన పోలీసులు.. మంగళవారం శ్రవణ్పై ఎక్కువ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పదేపదే రాజీవ్ అదే చెబుతున్నాడు:
చంచల్ గూడ జైలు నుంచి రాజీవ్, శ్రవణ్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ రాజీవ్ను ఎక్కువసేపు విచారించారు. అయితే శిరీషకు సంబంధించి తాను ఏవిధంగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరించలేదని, ఆమె ఆత్మహత్యకు ఏవిధంగాను తాను కారణం కాదని రాజీవ్ పదేపదే అదే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
శిరీష కుటుంబ సభ్యుల అనుమానాలపై:
ముఖ్యంగా శిరీషది హత్యే అంటూ ఆమె కుటుంబ సభ్యులు లేవనెత్తిన అనుమానాల పైనే పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. శిరీష ఆడియో టేపుల్లో నవీన్, నందు అనే కొత్త పేర్లు బయటపడటంతో.. వారిని కూడా పోలీసులు విచారించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద శిరీషను అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారా? అన్న కోణంలో పోలీసుల ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతోంది.
తొలుత అలా అనుకున్నప్పటికీ!:
కేసుకు సంబంధించి కొంత మిస్టరీ ఇంకా కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తున్న పరిస్థితుల్లో.. కస్టడీలో ఈ చిక్కుముడులన్నింటిని విప్పాలని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం 10గం. ప్రాంతంలో తిరిగి వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో చిత్రీకరణ జరుపుతున్నట్లు చెబుతున్నారు. మంగళవారం వీరిద్దరిని కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అక్కడికి తీసుకెళ్లే అవకాశం లేదని సమాచారం.
హత్యేనంటున్న మేనమామ:
మరోవైపు శిరీష కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది హత్యేనని మరోసారి ఆరోపించారు. ఆమె మేనమామ గోపాలకృష్ణ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. శిరీష మృతదేహాన్ని చూసే అవకాశం కూడా పోలీసులు తమకు ఇవ్వలేదని, ఒత్తిళ్ల కారణంగానే శిరీష కేసును ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు.