తెలంగాణాలో ఆరుకు చేరిన కరోనా బాధితులు: బ్రిటన్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలను వణికిస్తుంది . తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 147కి చేరింది .తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు కరోనా పాజిటివ్ గా తేలగా తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది . దీంతో తెలంగాణా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది.
రాష్ట్రంలో కరోనా .. ఆరోకేసు నమోదు
తెలంగాణాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా రాష్ట్రంలో ఆరోకేసు నమోదు అయ్యింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. కరోనా లక్షణాలు సాధారణమైన జలుబు, దగ్గు , జ్వరం వంటి లక్షణాలే కావటంతో ఎవరికి కరోనా ఉంది ఎవరికి లేదు అనేది కనిపెట్టటం చాలా పెద్ద కష్టంగా మారింది. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో కరోనా బారిన పడిన అందరూ విదేశాల నుండి వచ్చిన వారే
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అటు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారే కరోనా బారిన పడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం విదేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి కేటాయించింది .ఇప్పటివరకూ తెలంగాణలో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ప్రభుత్వం ప్రకటించింది. ఒకరు దుబాయ్ నుంచి, మరొకరు ఇటలీ నుంచి, ఇంకొకరు నెదర్లాండ్స్ నుంచి వచ్చారని తెలిపింది.మరో ఇద్దరు స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం తాజాగా మరో కేసు నమోదు అయినట్టు చెప్తుంది.
Recommended Video
బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్
బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ అని తేలిన వారి సంఖ్య ఆరుకి చేరింది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. మొట్టమొదట పాజిటివ్ కేసును గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా ఐసోలేషన్ వార్డుల్లో ఉండటానికి భయపడి వైద్యులను సంప్రదించటం లేదు. ఇక ఈ పరిస్థితి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.