దోపిడీ దొంగల ఆటకట్టు: 4కిలోల గోల్డ్ సీజ్(ఫొటోలు)
హైదరాబాద్: దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా గుట్టును కొద్ది గంటల్లోనే నగర పోలీసులు రట్టు చేశారు. ఓ నగల షాపులో దొంగిలించిన బంగారు ఆభరణాలను మరో షాపులో విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు దోపిడీ ఘటన జరిగిన కొద్ది గంటలకే నిందితులను పట్టుకోవటంతో పాటు వారి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.
ఈ మేరకు వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి మీడియాకు వివిరంచారు. పాతబస్తీ మొఘల్పురా బీబీబజార్ ప్రాంతానికి చెందిన బురాన్ షరీఫ్ (27) కొద్ది రోజుల క్రితం వరకు నాంపల్లిలోని మహ్మద్ఖాన్ జ్యుయెలరీ షాపులో పనిచేశాడు. అప్పట్లో బంగారాన్ని హోల్సేల్ ధరలకు కొనుగోలు చేసే పలువురు వ్యాపారులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
అక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత పనీపాటా లేకుండా తిరుగుతున్న బురాన్ షరీఫ్ రాత్రికిరాత్రే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని, దొంగతనాలు చేద్దామని తన స్నేహితుడు చింతల్బస్తీకి చెందిన ఖాజా ఫసీయుద్దీన్(28)తో కలిసి ప్రణాళిక సిద్దం చేశాడు. హుమాయున్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముజ్తాబా జ్యుయలరీ షాపులో పదేళ్లుగా సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి తనకు పరిచయం ఉన్నాడని ఫసీయుద్ధీన్ షరీఫ్తో చెప్పాడు.
ఆ తర్వాత మరో ఏడుగురు యువకులను కలుపుకుని ముజ్తాబా జ్యుయలరీ షాపులో బంగారాన్ని దొంగిలించేందుకు ప్రణాళిక వేశారు. ఈ ముఠా సభ్యులు 15 రోజుల పాటు ఆ నగల షాపుకు వస్తూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మే 30వ తేదీన నర్సంహారెడ్డి అనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 4 కిలోల బంగారాన్ని ముజ్తాబా జ్యుయలరీ షాపులో ఇచ్చి వెళ్లి, సాయంత్రం తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చాడు.
రెండు రకాల నెక్లెస్లను ఎంపిక చేసుకున్న నర్సింహారెడ్డి ఆ మొత్తం బంగారాన్ని తీసుకుని షాపు నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అతని కోసం షరీఫ్, ఫసీయుద్దీన్ ఇతర నిందితులు కాపు కాశారు. బంగారం తీసుకుని బయల్దేరిన నర్సింహారెడ్డి వాహనాన్ని అడ్డగించి, అతని కళ్లలో కారం చల్లారు. దీంతో వాహనం అదుపు తప్పి నర్సింహ్మారెడ్డి కింద పడిపోయాడు. అంతటితో ఆగని నిందితులు అతడ్ని ఐరన్ రాడ్తో కొట్టి బంగారాన్ని తీసుకుని పరారయ్యారు.
ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, కేవలం గంటల వ్యవధిలోనే పట్టుకుని, వారి నుంచి 3.8కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.
నిందితులు బురాన్ షరీఫ్, ఫసీయుద్ధీన్తో పాటు అమన్కేఫ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇక్బాల్, సయ్యద్ అర్షద్, పాతబస్తీ తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన ఆతిఫ్ అలీ బేగ్, తలాబ్కట్ట నషేమన్నగర్కు చెందిన విద్యార్థి గోరును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
వారి నుంచి బంగారంతో పాటు రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న తలాబ్కట్టకు చెందిన మరో నిందితుడు ఇమ్రాన్(19) కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దోపిడీ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవరించిన పోలీసులను కమిషనర్ అభినందించారు.