పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం: రూ.23 లక్షలతో పరారీ, పక్కా ప్లాన్తోనే..
పక్కా ప్లాన్ ప్రకారం ఆరుగురు దోపిడీ దొంగలు మేడ్చేల్ సమీపంలోని పెట్రోల్ బంకు నుంచి రూ.23 లక్షలు ఎత్తుకెళ్లారు. బంకులో బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్: మేడ్చల్ మండలం అత్వెల్లి-ఎల్లంపేట్ 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భారత్ పెట్రోలియం బంకులో సోమవారం తెల్లవారు జామున బందిపోటు దొంగలు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ బంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి కత్తులతో దాడి చేశారు. లాకర్ను బద్దలు కొట్టి సుమారు రూ.23 లక్షల నగదును, సిసి కెమెరాలను ఎత్తుకుని వెళ్లారు.
పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి - ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గం. 2.00 నుంచి 2.30ల మధ్య ఆరుగురు వ్యక్తులు ముఖాలకు మంకీ క్యాప్లు ధరించి బంకు క్యాబిన్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో క్యాబిన్ సూపర్వైజర్ సంజీవరెడ్డితో పాటు సిబ్బంది బాలసాయి, శ్రావణ్కుమార్, రవికుమార్, సెక్యూరిటీ గార్డు ధన్రాజ్ కూర్చుని ఉన్నారు. క్యాబిన్ బయట బంకు వద్ద లింగారెడ్డి అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు.
క్యాబిన్లోకి చొరబడిన ఆరుగురు బందిపోటు దొంగలు లోపలికి వస్తూనే సూపర్వైజర్ సంజీవరెడ్డి తలకు తుపాకీ గురిపెట్టి బంకు వద్ద విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని లోపలికి పిలువాలని ఆదేశించారు. దీంతో వణికిపోతూ సంజీవరెడ్డి, బంకు వద్ద లింగారెడ్డిని లోపలికి రావాలని పిలిచాడు. అనంతరం బందిపోటు దొంగలు సూపర్వైజర్తో పాటు సిబ్బందిపై ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేశారు. కాళ్లు చేతులు ముఖంపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయబ్రాంతులకు గురిచేశారు.

డబ్బులు భద్రపరిచిన లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. భయంతో లాకర్ తాళాలను దొంగలకు అప్పగించారు. బంకు సిబ్బంది ఉపయోగించే స్పోర్ట్స్ కిట్ బ్యాగ్లోనే లాకర్లో భద్రపరిచిన రూ.22,97,306 రూపాయలను దొంగలు సర్దుకున్నారు. ఈ క్రమంలో దొంగలు క్యాబిన్లోని ఎలక్ట్రానిక్స్ వస్తువులను ధ్వంసం చేశారు. సిబ్బంది వద్ద గల ఫోన్లను లాక్కుని పగులగొట్టారు. క్యాబిన్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పది నుండి 15 నిమిషాల పాటు బీభత్సం సష్టించి వెళ్లిపోయారు.
దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ధన్రాజ్ వద్ద మరో ఫోన్ ఉండగా దానితో సమాచారాన్ని బయటకు చేరవేశారు. సమాచారం అందుకున్న మేడ్చల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.బందిపోటు దొంగలు తెలుగులో కాకుండా ఇతర భాషలలో మాట్లాడారని, ముఖాలకు మంకీ క్యాప్లు ధరించారని వివరించారు. దొంగల దాడిలో గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సోమవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థిని సమీక్షించారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. అప్పటికే పేట్బషీరాబాద్ డివిజన్ ఏసిపి అశోక్కుమార్ గౌడ్ బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్ మేడ్చల్ సిఐ రాజశేఖర్రెడ్డి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను, డాగ్స్క్వాడ్ను కూడా రప్పించారు. పోలీసు జాగిలాలు మేడ్చల్ హైవే వరకు వెళ్లి అగిపోయాయి.
2008లోనూ ఇదే నెలలో దోపిడీ
ఆదివారం అర్థరాత్రి మేడ్చల్లో పెట్రోల్ బంకుపై జరిగిన దాడి తరహలోనే 2008 డిసెంబర్లో కూడా ఇలాంటి దోపిడీ జరిగింది. నలుగురు బందిపోటు దొంగలు టాటా సుమోలో వచ్చి బంకు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడ్డారు. కాల్పుల్లో బంకు సిబ్బంది ఇద్దరు తీవ్రం గా గాయపడ్డారు. మళ్లీ అదే బంకులో ఇదే తరహాలో దోపిడీ జరుగడం గమన్హారం.
తొలుత రెక్కీ.. ఆ తర్వాత దోపిడీ
బందిపోటు దొంగలు బంకులో బీభత్సం సృష్టించి నగదును అపహరించేందుకు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంకు కంపెనీ అవుట్లెట్ కావడం, బ్యాంకులకు కూడా వరుసగా మూడు రోజులు సెలవు రాడం, డబ్బును బంకు సిబ్బంది క్యాబిన్లోని లాకర్లోనే భద్రపరచడాన్ని చూస్తే దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే బంకుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications