రాజకీయ సన్యాసం వద్దు!: సోమారపును బుజ్జగించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు తప్పుకుంటానని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమారపు సత్యనారాయణతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు.
రాజకీయాలకు గుడ్ బై: ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సంచలన నిర్ణయం
ఆ నిర్ణయం వద్దు
మంగళవారం మంత్రి కేటీఆర్ తోపాటు సోమారపు సత్యనారాయణ తెలంగాణ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సోమారపు సత్యనారాయణను బుజ్జగించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
మీరు పార్టీకి అవసరం
‘టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు మీ అనుభవం, పరిజ్ఞానం అవసరం' అని కేటీఆర్.. సోమారపు సత్యనారాయణతో అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని కోరారు.
సోమారపు వాదన
అనంతరం సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను తన పనిని నమ్ముకున్నానని తెలిపారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని స్పష్టం చేశారు. తమ కార్పొరేటర్లు రామగుండం మేయర్ను దించాలని నిర్ణయించుకున్నారని, తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. మంత్రి కేటీఆర్ బాగా పనిచేస్తున్నారని సోమారపు ప్రశంసించారు.
మేయర్తో విభేదాలు
కాగా, కేటీఆర్ సూచన మేరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను సోమారపు విరమించుకున్నట్లు తెలిసింది. సోమారపు సత్యనారాయణకు, రామగుండం మేయర్కు పడటం లేదని, ఈ క్రమంలోనే అవిశ్వాసం తెరపైకి తెచ్చారని సోమారపుపై ఆరోపణలు వచ్చాయి.