భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. పలు రైళ్లను రద్దు !
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తుండటంతో రాష్ట్రం మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతుండటంతో రవాణా వ్యవస్థకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రద్దు అయిన రైళ్లు..
- ముంబై-లింగంపల్లి దేవనగరి ఎక్స్ప్రెస్
- ఓఖా-రామేశ్వరం
- భగత్ కీ కోఠి-కాచిగూడ
- నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లాంటి పలు రైళ్లు నిలిపివేయబడ్డాయి. అలానే కాచిగూడ-మెదక్ రైలు పాక్షికంగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

ఇక కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు రవాణా సౌకర్యాలు కోల్పోయి బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోయాయి. తక్కువ ఎత్తులో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో కార్లు, బైకులు వరద నీటికి కొట్టుకుపోయాయి. పంటలు మునిగి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అలానే మెదక్ జిల్లా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ను నీరు ముట్టి, దాదాపు 350 మంది విద్యార్థినులు ఆ ప్రాంగణంలో ఇరుక్కుపోయారు. రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారం, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తాళ్ల సాయంతో విద్యార్థినులను ఒక్కొక్కరిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
మరోవైపు ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరులో ఐదుగురు వ్యక్తులు వరదలో ఇరుక్కుపోయారు. వారిలో స్వామితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ "ఏ మాత్రం భయపడవద్దు, అధికారులు మీతో ఉన్నారు" అని ధైర్యం చెప్పారు. మిగతా బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బాధితులకు తక్షణం ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన చోట సహాయక చర్యలు తక్షణమే చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications