రుతుపవనాలు కదలికలు: తెలంగాణలో మరో 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల కదలికల నేపథ్యంలో ఈ వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది.
రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముంద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ, తూర్పు, మధ్య బంగళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.
బుధవారం ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అస్సాం, ఢిల్లీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు జనజీవననాన్ని స్తంభింపజేశాయి. కాగా, మే 27న కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.