ఆంధ్రోళ్లతో పంచాయతీ ఒడవలేదు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ వచ్చినా ఆంద్రోళ్లతో పంచాయితీలు ఒడువలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. అయితే వెనుకంజ వేయబోమని అన్నారు. జిద్దు పడితే ఏదైనా సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని కట్టె పట్టుకోని కిరణ్కుమార్ చెప్పాడని, ఆయన ఇవ్వాళ్ల ఎక్కడున్నడు? నేడు కరెంట్ ఎట్ల వస్తుందని కెసిఆర్ అన్నారు. ఇక నుంచి తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవఅని చెప్పారు. వచ్చే మార్చి నుంచి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్ను అందిస్తామని ప్రకటించారు. కళాకారుల సమ్మేళన సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు.
పది నెలలుగా సచివాలయంలో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన తనకు ఈ సభతో పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ఆయన అన్నారు. కళాకారులతో తనకున్న అనుబంధంనుంచి అనేక ఉద్యమ ఘట్టాలు, అనుభవాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కళ్లలో నీళ్లు తిరుగుతాయి..
ఉద్యమంలో ఒక్కో జ్ఞాపకం గుర్తుకు వస్తే కండ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. ఎన్నో అణచివేతలు, అవమానాలు, అవహేళనలు ఎదుర్కున్నామని అన్నారు. అయినా బెదరకుండా కళాకారులు తీసుకున్న గట్టి సంకల్పం వల్లే స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ఎక్కడికక్కడ ఎందరో గాయకులు, కవులు, కళాకారులు ఉద్యమం తమది అన్న గొంతు కలిపి నడిచారని అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఒక్కోపాట ఒక ఆణిముత్యమని చెప్పారు. మా జిల్ల పేరు చెపితే జల్లు మనాలే .. గుంటూరు జిల్లాలో గుంటెడు జాగడిగితిమా..అయ్యోనివా నువ్వు అవ్వోనివా వంటి పాటలు ప్రత్యర్థులను బెంబేలెత్తించాయని గుర్తు చేసుకున్నారు.
ప్రతి పాటకు తెలంగాణ రుణపడి ఉందని అన్నారు. ఎండకు ఎండి వానకు తడిసి ఎన్నో ఇక్కట్టు పడ్డం.. 2003లో వరంగల్ కళాకారుల యాత్ర జరిపినం.. హేలనగా మాట్లడి గోల చేసిన వారిని బోల్తా కొట్టించినం అని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం 550 మంది కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసిందని, ఇంకా పదో ఇరవయ్యో మిగిలితే వారికీ అవకాశం ఇస్తామని కేసీఆర్ అన్నారు. నిన్నటిదాకా ఉద్యమకారులైన కళాకారులు ఇకనుంచి బంగారు తెలంగాణకు కరదీపికలు కావాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే తన జీవితం పండిందని, ధన్యమైందని, ఇది సాలు అనుకున్నానని, అయితే ప్రజలు పదవిని ఇచ్చి కట్టిపారేశారని కేసీఆర్ అన్నారు.
బాలకిషన్కు మంత్రి పదవి...
ఉద్యమంలో బాలకిషన్ చేసిన కృషికి తగిన ఫలితం త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఇపుడు క్యాబినెట్ ర్యాంకే వచ్చిందని, త్వరలో మంత్రివర్గంలో సభ్యుడవుతాడని అన్నారు. సాంస్కృతికశాఖ మంత్రి అయ్యే మంచిరోజులున్నాయని చెప్పారు. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలని, కొత్తగా ఆలోచించాలని చెప్పిన కేసీఆర్ బంగ్లాదేశ్లో ప్రొఫెసర్ యూనస్ చేసిన ప్రయోగాన్ని వివరిం చారు.