వీడియో: స్ట్రీట్పైట్లో కొడుకు మృతి, తండ్రి ఆవేదన
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల విచారణలో యువకుడి మృతి హత్యగా తేలింది. నిజానికి పాతబస్తీ వీధుల్లో సంపన్నుల పిల్లలు కొట్టుకుంటూ ఉంటుంటారు. అందులో భాగంగా మీర్చౌక్ స్ట్రీట్ఫైట్లో ప్రత్యర్థితో నబిల్ తలపడ్డాడు. ప్రత్యర్థి విసిరిన పంచ్లతో నబిల్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా నబిల్ మృతి చెందాడు.
గత మూడేళ్లలో ఇది నాల్గవ కేసని స్ధానికులు తెలిపారు. స్ట్రీట్ఫైట్ను దాచిపెట్టి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించేందుకు నబిల్ స్నేహితులు యత్నించారు. అయితే నబిల్ మరణానికి అసలు కారణం స్ట్రీట్ ఫైట్ జరిగిన సమయంలో తీసిన మొబైల్ వీడియో ద్వారా పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు.
దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. బెట్టింగ్లో భాగంగానే స్ట్రీట్ ఫైట్ జరిగినట్లు సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు.
నబిల్ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతానికి నబిల్ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటన జరిగింది మే 3న అయితే తమకు ఫిర్యాదు అందింది మాత్రం ఏడవ తేదీన అని తెలిపారు.
నబిల్ను కొట్టి చంపిన వ్యక్తి అబేజ్ అహ్మద్గా గుర్తించామన్నారు. అతన్ని కొట్టమని అబేజ్కు సుల్తాన్ అనే విద్యార్థి సూచించినట్లు తెలిపారు. ఆ స్ట్రీట్ ఫైట్కు రిఫరీగా ఉన్నది డాలర్ వసీం అని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
స్ట్రీట్ ఫైట్లో నబీల్ మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రేపు నబీల్ మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిర్వహించనున్నారు. పాతబస్తీలో ఈ స్ట్రీట్ఫైట్ నిర్విహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వీడియోని చూడలేనన్న తండ్రి
తన కుమారునిపై పిడిగుద్దలు గుద్దుతన్న వీడియోని ఓ తండ్రి స్ధానంలో తాను చూడలేనని నబిల్ తండ్రి యూసుఫ్ అన్నారు. నబిల్ చనిపోయిన అనంతరం తమకు బైక్ యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పారని తెలిపారు. ఇంట్లో ఉన్నవాడిని ఏ విషయం చెప్పకుండా తీసుకెళ్లారని, ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు.
తన కుమారుడు చనిపోయిన వీడియోని మీరంతా చూశారని, కొడుకు చనిపోయే వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.