థర్డ్ ఫ్లోర్లో బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ పైకి దూకబోయి జారిపడ్డ విద్యార్థి, మృతి
హైదరాబాద్: మైసమ్మగూడలోని ఓ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి జారిపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా జూలురుపాడుకు చెందిన సాయి కిరణ్. సరదా కోసం హాస్టల్ ఓ భవనం నుంచి మరో భవనం పైకి దూకుతుండగా ఈ విషాదం జరిగింది.
సాయి కిరణ్ మూడో అంతస్థులో ఓ భవనంపై నుంచి మరో భవనానికి దూకటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను జారి రెండో అంతస్థులో పడ్డాడు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి కిరణ్ బీటెక్ చదువుతున్నాడు.
సాయి కిరణ్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందారు. ఇతని చిన్నాన్న వెంకటేశ్వర రావు చదివిస్తున్నారు. సాయి కిరణ్ మైసమ్మగూడలోని సాయిబాలాజీ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి ఏడాది చదువుతున్నాడు.
తను ఉంటున్న హాస్టల్ మూడో అంతస్థు నుంచి పక్కనే ఉన్న మరో హాస్టల్లో ఉన్న స్నేహితుడ్ని కలవటానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. తిరిగి తన హాస్టల్కు వచ్చేందుకు అతను ఆ భవనం నుంచి ఈ భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు.
ఇందుకు సంబంధించి వీడియోలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. తొలుత సాయి కిరణ్ స్నేహితుడు ఒకరు ఆ భవనం నుంచి ఈ భవనంపైకి దూకాడు. ఆ తర్వాత సాయి కిరణ్ దూకే ప్రయత్నంలో జారి పడ్డాడు.
తిరిగి కిందికి దిగి రావడానికి అలస్యమవుతుందని భావించి ఆ హాస్టల్ నుంచి ఇతడు ఉంటున్న హాస్టల్ భవనంలోకి దూకాడు. దీంతో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సూరారంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.