ఎయిర్ టెల్ సెకెండ్ హెడ్ క్వార్టర్స్ గా హైదరాబాద్..!!
హైదరాబాద్.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మరో ప్రతిష్టాత్మక మైలురాయికి చేరువవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్.. హైదరాబాద్ ను ఎయిర్టెల్ సెకండ్ హెడ్క్వార్టర్స్ గా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ఇక్కడి నూతన పారిశ్రామిక సింగిల్ క్లియరెన్స్ విధానాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంస్కరణలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అనుకూలమైన కొనసాగుతోందని, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన చిరునామాగా మారిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీ వెలుపల హైదరాబాద్ను రెండో పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సునీల్ మిట్టల్ తెలిపారు. డేటా సెంటర్ సామర్థ్యాన్ని భారీగా పెంచడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని గణనీయంగా బలోపేతం చేసేందుకు తమ సంస్థ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు. చందన్వెల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత ఎయిర్టెల్ డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
భవిష్యత్తు సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలో ఒక భారీ సమీకృత డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. సాంకేతిక రంగంలో మరింత వేగంగా పురోగతిని సాధించడంలో భాగంగా హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విస్తరణను ముమ్మరం చేయాలని సునీల్ మిట్టల్ కు సూచించారు.
విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్ర పునరుద్ధరణ, యువతకు నైపుణ్యాల పెంపు కోసం 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' ఏర్పాటు, ఐటీఐలను అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చడం, పాలిటెక్నిక్ కళాశాలల ఆధునీకరణ వంటి వినూత్న కార్యక్రమాల గురించి సునీల్ మిట్టల్ కు వివరించారు. ఆయా నిర్ణయాలు పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను సృష్టించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతలో భాగంగా భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీ కేంద్రాల పేద విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎయిర్టెల్ భవిష్యత్తు పెట్టుబడుల పురోగతికి, ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కోసం ఒక ప్రత్యేక సీనియర్ ఎగ్జిక్యూటివ్ను నోడల్ అధికారిగా నియమించనున్నారు. తద్వారా రాబోయే పెట్టుబడుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.












Click it and Unblock the Notifications