తెలంగాణ మహిళ ఛైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి, ఆరుగురు సభ్యుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్ పర్సన్ తోపాటు ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది.
మహిళా కమిషన్ సభ్యులుగా కే ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, షహీనా, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి, కటారి రేవతీరావు నియమితులయ్యారు. ఛైర్ పర్సన్ తోపాటు సభ్యులంతా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ హయాంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈ పదవి వరించడం గమనార్హం.
కాగా, గతంలో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004,2009వ సంవత్సరాల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు.
అయితే, 2014లో జరిగిన మెదక్ ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి సునీత లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.