CJI Ramana : యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న సీజేఐ రమణ దంపతులు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎన్వీ రమణ దంపతులు మంగళవారం(జూన్ 14) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సీజేఐ దంపతులకు మహాదాశీర్వచనంతో పాటు స్వామి వారి తీర్థ ప్రసాదాలు,శేష వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో పూజల అనంతరం సీజేఐ దంపతులు వీవీఐపీల కోసం నూతనంగా నిర్మించిన అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను సీజేఐ పరిశీలించనున్నారు. వైటీడీఏ అధికారులు అక్కడ చేపడుతున్న పనుల గురించి సీజేఐకి వివరించారు.
అంతకుముందు,ఉదయం 7గంటలకు సీజేఐ దంపతులు హైదరాబాద్ నుంచి యాదాద్రి బయలుదేరారు. ఉదయం 8.30గంటలకు యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,జగదీశ్ రెడ్డి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించారు.
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్,గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి కూడా సీజేఐ దంపతుల వెంట వెళ్లాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో ఆ ముగ్గురు సీజేఐ వెంట వెళ్లలేకపోయారు. రెండు రోజుల క్రితం సీజేఐ రమణను హైదరాబాద్లోని రాజ్భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీఎం... యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామిని దర్శనానికి సీజేఐ దంపతులను ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు సీజేఐ దంపతులు మంగళవారం(జూన్ 14) యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు.
Recommended Video
గత శుక్రవారం సీజేఐ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. రంగనాయకుల మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేదపండితులు ఆశీర్వచనాలు ఇవ్వగా.. టీటీడీ అధికారులు మర్యాద పూర్వకంగా శేష వస్త్రంతో సత్కరించి, తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వామివారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.