టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు సుప్రీంకోర్టులో ఊరట: ఈడీ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: తెలుగు న్యూస్ ఛానల్ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఈడీ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరగా.. సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది.
బెయిల్ షరతులను రవిప్రకాశ్ ఉల్లంఘించారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ పరిశీలించిన తర్వాతు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని సుప్రీం ధర్మానం తెలిపింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి సెప్టెంబర్-2019 మే వరకు రవిప్రకాశ్, మరో ఇద్దరు రూ. 18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, 2019 అక్టోబర్లో కేసు నమోదు చేసి, దీని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేశాయి. ఈ కేసులో రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. తిరస్కరించింది.
కాగా, ఫిబ్రవరి నెలలో కొత్త పాస్ పోర్ట్ జారీకి ప్రాంతీయ పాస్ పోర్టు అధికారులను ఆదేశించాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. తనను అన్యాయంగా టీవీ9 డైరెక్టర్ పదవి నుంచి తొలగించారన్నారు. టీవీ9 కార్యాలయంలోనే తన పాస్ పోర్టు, విలువైన పత్రాలు, కొంత నగదు ఉండిపోయిందని పేర్కొన్నారు.