గవర్నర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ బిల్లులు: కేంద్రం వైఖరి చెప్పాలంటూ సుప్రీం ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై జాప్యం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది.
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై జాప్యం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.
బిల్లులు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టిన గవర్నర్కు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ కు నోటీసులు జారీ చేస్తే అది తప్పుడు సందేశమే అవుతుందన్నారు. ఇదొక సంప్రదాయంగా మారే అవకాశం ఉందన్నారు.

అంతేగాక, పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఈ పిటీషన్లో పేర్కొన్నదని తుషార్ మెహతా వాదించారు. కానీ, ఇందులో కొన్ని బిల్లులు ఇటీవలే రాజ్భవన్కు చేరుకున్నాయని వివరించారు. తాను తెలంగాణ రాజ్ భవన్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. ఏయే బిల్లులు ఎందుకు ఆమోదం పొందకుండా ఉన్నాయో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనికి స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అన్ని వివరాలు తెప్పించుకుని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ కు సూచించింది.
అంతేగాక, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలంటూ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హాజరయ్యారు. కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని వచ్చే వారం పరిశీలనకు వాయిదా వేసింది. కాగా, గవర్నర్ రాజ్యాంగ కార్యకర్త అని భావించి గవర్నర్ కార్యాలయానికి ధర్మాసనం అధికారికంగా నోటీసులు జారీ చేయలేదు. ఈ పిటిషన్లో గవర్నర్ కార్యదర్శి మొదటి ప్రతివాది.












Click it and Unblock the Notifications