నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
తెలుగుతోపాటు తమిళంలోనూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది నటి ప్రత్యూష. పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన అందం, నటనతో మెప్పించి అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఎదిగింది. తెలంగాణలోని భువనగిరికి చెందిన ఈమె.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని "శ్రీమతి లవ్లీ స్మైల్" బిరుదును గెలుచుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ఐదు సంవత్సరాల్లో 11 సినిమాల్లో నటించి.. ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.
2002లో ప్రత్యూష్ ఆత్మహత్య వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరణ సమయంలో ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె డెత్ మిస్టరీ ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని.. రేప్ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు..
ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలానే నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీ దేవి సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి అప్పీళ్లపై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమాయణం..
కాగా ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు నుంచి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా... సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యారు. అయితే కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ప్రత్యూషకు ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది.
అలానే రిపోర్టు ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ... నిందితుడిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాంతో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. కాగా సిద్ధార్థరెడ్డి, సరోజినీ దేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.
టాలీవుడ్ ఎంట్రీ..
ప్రత్యూష 1998లో మోహన్ బాబు నటించిన 'రాయుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె మోహన్ బాబు కూతురుగా కనిపించి.. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు లభించాయి. తెలుగులో శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.












Click it and Unblock the Notifications