సురభిగార్డెన్ సీజ్, ఏసీబీకి దొరికిన మరో అవినీతి చేప
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సురభి గార్డెన్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. దాదాపు యాభై ఏళ్ల క్రితం గృహావసరాల నిమిత్తం మూడు ఎకరాలకు పైగా లీజుకు తీసుకున్న సురభి గార్డెన్స్ యజమాని, అనుమతులు లేకుండా వాణిజ్యపరమైన అంశాలకు వినియోగించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనుమతులు లేకుండా డీజే, లైసెన్స్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. అంతేకాదు, దానిని సబ్ లీజుకు, ఫంక్షన్లకు ఇవ్వడం చేశారు. లోపల పక్షులు, జంతువులను పెంచుతున్నారు. దీంతో సురభి ఫంక్షన్ హాలు పైన గురువారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
సరూర్ నగర్లో ఏసీబీ సోదాలు
సరూర్ నగర్లోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శివలింగం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తున్నాయని అతని పైన ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు అతని బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దు ఆలంపూర్ చెక్ పోస్టు వద్ద శివలింగం విధులు నిర్వహిస్తున్నారు.