శిరీష ఘటన మరువకముందే!, మరో వివాహిత ఆత్మహత్య!.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
ప్రస్తుతం గచ్చిబౌలిలోని గిరీష్ ఇంటి ఎదుటే పద్మజ మృతదేహాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పద్మజ హత్యేనని గిరీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య మరిచిపోకముందే నగరంలో మరో వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలోని స్థానిక సుదర్శన్ నగర్లో భర్తతో కలిసి నివాసముంటున్న పద్మజ(35) అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.
పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పద్మజ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతుండగా.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. కట్నం కోసం అత్తింటివారు పెట్టిన వేధింపులే ఆమెను బలితీసుకున్నాయని, హత్య వెనుక భర్త గిరీష్(37) పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. గిరీశ్ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని గిరీష్ ఇంటి ఎదుటే పద్మజ మృతదేహాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పద్మజ హత్యేనని గిరీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పోస్టుమార్టమ్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పద్మజ మృతదేహంపై నుదుటి భాగంలో బలమైన గాయాలు ఉండటంతో.. ఈ అనుమానాస్పద మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.