కేంద్రం పూర్తిగా వైఫల్యం... ఇప్పుడు కావాల్సింది మన్ కీ బాత్ కాదు జన్ కీ బాత్... రాహుల్ కీలక వ్యాఖ్యలు...
దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా ఉధృతితో దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. అంతేకాదు,ఇప్పుడు 'జన్ కీ బాత్' ముఖ్యమంటూ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి కౌంటర్ ఇచ్చారు.
'వ్యవస్థ విఫలమైంది... ఇప్పుడు జన్ కీ బాత్ ముఖ్యం... ఈ సంక్షోభ కాలంలో బాధ్యాతయుతమైన పౌరుల అవసరం దేశానికి ఉన్నది. కాంగ్రెస్ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా... రాజకీయపరమైన కార్యక్రమాలన్నీ పక్కనపెట్టండి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి.. దేశ ప్రజలను బాధను తీర్చండి..' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా మహమ్మారికి సంబంధించిన వాస్తవాలు ఇంకా కప్పి ఉంచుతున్నారని... మరణాల సంఖ్యను తక్కువగా రిపోర్ట్ చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. 'నిజాలను దాచండి... ఆక్సిజన్ కొరత లేదని చెప్పండి... మరణాల సంఖ్యను తక్కువగా చూపండి... మొత్తంగా ఆయన ఫేక్ ఇమేజ్ను కాపాడేందుకు భారత ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది..' అని రాహుల్ ఘాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించిన రోజే రాహుల్ నుంచి ఈ పదునైన విమర్శలు రావడం గమనార్హం. ఇప్పుడు ప్రధాని మన్ కీ బాత్ కన్నా జన్ కీ బాత్ అవసరం ఉందని ఆయన కౌంటర్ ఇచ్చారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోందని... అయితే కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ రాష్ట్రాలకు సాయం చేస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కరోనా కేసులు,మరణాల లెక్కలను దాచిపెట్టడం దేశానికి నష్టం చేస్తుందన్నారు.
దేశంలో ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పనున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. తద్వారా జిల్లా స్థాయిల్లో తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని... హెల్త్ కేర్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.