కాంగ్రెస్ "చేయూత" లక్ష్యం ఫిక్స్ - కర్ణాటక మార్క్ ప్లాన్..!!
కర్ణాటక తరువాత ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ పై గురి పెట్టింది. ఖమ్మంలో రాహుల్ పాల్గొన్న సభ సక్సెస్ కావటంతో కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారు. ఈ సభ నుంచి రాహుల్ ప్రకటించిన చేయూత గ్యారెంటీ స్కీం పైన కాంగ్రెస్ భారీ కసరత్తు తరువాత నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో కాదు..బీఆర్ఎస్ తోనే తమ పోరాటం అని ప్రకటించిన రాహుల్..ఇప్పుడు ఆ పార్టీ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. ప్రస్తుతం అందున్న పెన్షన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామంటూ పథకం ప్రకటించారు.
కాంగ్రెస్ కొత్త వ్యూహం
పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. బీఆర్ఎస్ లక్ష్యంగా ఈ ప్రకటన చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాదితులు, డయాలసిస్ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అమలులో లోపాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
చేయూతతో మద్దతు పొందేలా
ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా అమలు కావటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడుతందని విశ్వసిస్తన్నారు. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి.
వరుస హామీలతో ఎన్నికల బరిలోకి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్లో యువజన డిక్లరేషన్ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి.

కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు పైన గురి పెట్టిన కాంగ్రెస్..తమ వైపు తిప్పుకోవటం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications