కరోనా అంశంలో టీ సర్కార్ ది బాధ్యతారాహిత్యం.!ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదన్న షర్మిళ.!
హైదరాబాద్ : కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పదేపదే డిమాండ్ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని వైయస్ షర్మిళ అభిప్రాయ పడ్డారు. కరోనా బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పల్లెలు, పట్టణాలు కరోనా భారినడ్డాయని ఆరోపించారు.
కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకుండా, ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పేషెంట్లే హాస్పిటల్ బిల్లులు కట్టుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో ప్రభుత్వం కరోనా వైద్యాన్ని, బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయాన్ని వైయస్ షర్మిళ గుర్తు చేశారు.

అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో టెస్టులు ఎందుకు చేయించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైయస్ షర్మిళ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రయివేట్ ఆస్పత్రుల అధిక బిల్లులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కరోనాభారిన పడిన గ్రామాల్లో ఎక్కడికక్కడే టెస్టులు చేసేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇప్పటి వరకు టీకాల విషయంలో హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నాలుగు రోజులుగా టీకా ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. టీకాల లెక్కల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేడా ఎందుకు వస్తుందో చెప్పాలని, అందుబాటులో వున్న వ్యాక్సిన్ల పూర్తిగా వినియోగించాలని వైయస్ షర్మిళ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications