కేంద్రం తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు; ఐటీ, ఈడీదాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలోని అధికార బీజేపీ వర్సెస్ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ ను ఏర్పాటు చేసి బీజేపీని టార్గెట్ చేయాలని టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ మంత్రులపై ఫోకస్ పెట్టాయి. ఇక దీనిపై తెలంగాణ మంత్రులలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది.

ఐటీ, ఈడీ దాడులపై మండిపడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఐటీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. తాటాకు చప్పుళ్ళకు, బిజెపి బెదిరింపులకు భయపడేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బిజెపి చేయిస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది: తలసాని
అధికారం శాశ్వతం కాదని పేర్కొన్న ఆయన ఈరోజు మీరు ఉన్నారు.. రేపు మీరు మారినప్పుడు కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని మర్చిపోవద్దు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మీ చేతిలో ఉన్న అధికారం రేపు మా చేతిలోకి రావచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కావాలనే టార్గెట్ చేస్తున్నాయని వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేసిన ఆయన, పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది అంటూ విమర్శించారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.

రొటీన్ గా చేసే తనిఖీలు కావు.. టార్గెట్ గానే ఇదంతా
తప్పు చేసిన వారే భయపడతారని పేర్కొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్ గా దాడులు చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తున్నారని తెలిపిన ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రొటీన్ గా చేసే తనిఖీలు అయితే పట్టించుకోమని, కానీ అలా కాకుండా టార్గెట్ గా దాడులు నడుస్తున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

దేశ చరిత్రలోనే ఇలాంటి విధానాలు ఎక్కడా లేవు
ఇక తనకు జ్వరం వస్తే కూడా రాజకీయం చేశారని మండిపడిన ఆయన వీటికి భయపడి ఉంటే హైదరాబాద్లో ఎలా ఉంటాం అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పి తీరుతామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళతామని పేర్కొన్న ఆయన ప్రజలను చైతన్యం చేసి ఏం జరుగుతుందో ప్రజలకు చూపిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications