పార్టీ ఆవిర్భావ వేళ షర్మిల వ్యూహాత్మక అడుగులు :కేసీఆర్ వ్యతిరేకులకు ఆహ్వానం : ప్రసంగం సైతం..!!
జెండా - అజెండా ఖరారైంది. అధికారికంగా ప్రకటనే మిగిలింది. అందుకు మహూర్తం సిద్దమైంది. ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన తన తండ్రి వైఎస్సార్ జన్మదినం కావటంతో హైదరాబాద్ వేదికగా తన నూతన పార్టీ పేరు ప్రకటిస్తారు. అదే సమయంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తన అజెండాను ప్రకటిస్తారు. తెలంగాణలో రాజకీయ ఆరంగేట్రం గురించి ఫిబ్రవరి 9న ప్రకటన చేసిన సమయంలోనే షర్మిల తన ఉద్దేశాన్ని స్పష్టం చేసారు.
టార్గెట్ కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పార్టీ ఏర్పాటుకు ముందే షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. నిరుద్యోగ యువతకు మద్దతుగా మూడు రోజుల పాటు దీక్ష చేసారు. రైతులకు మద్దతుగా ముఖ్యమంత్రి పైన విమర్శలు గుప్పించారు. ఇక, నీటి వివాదాల అంశంలో వ్యూహాత్మకంగా స్పందించారు. తెలంగాణకు నష్టం జరిగితే ఎవరితోనైనా పోరాటానికి సిద్దమని చెప్పిన షర్మిల..పార్టీ ఆవిర్భావ వేడుక ద్వారా ఏపీ ప్రభుత్వ నిర్ణయాల విషయం పైన మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
పలువురికి ఆహ్వానాలు..
షర్మిల తన పార్టీ ఆవిర్భావ సభ కు తెలంగాణలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా...పలు రంగాలకు చెందిన ప్రముఖలతో పాటుగా...కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని సభకు రావాల్సిందిగా కోరుతున్నారు. అందులో భాగంగా.. బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య ను ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం గద్దర్, మాజీ డీజీపీ స్వర్ణ జిత్ సేన్, మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర రెడ్డి సైతం షర్మిలకు మద్దతు ప్రకటించారు. వారు సైతం ఈ ఆవిర్భావ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను సైతం ఆవిర్భావ సభకు రావాల్సిందిగా షర్మిల ఆహ్వానం పంపారు.
Recommended Video
షర్మిల ప్రసంగం పై ఆసక్తి..
ఆవిర్భావ సభలో తెలంగాణలో తన రాజకీయ ప్రవేశం నుండి..తన లక్ష్యం వరకు షర్మిల కీలక ప్రసంగం చేయనున్నారు. అందులో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉచిత విద్య-వైద్యం పైన షర్మిల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 8వ తేదీ ఉదయం బెంగుళూరు నుండి ఇడుపుల పాయ చేరుకొని అక్కడ తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. పంజాగుట్ట వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభ లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సైతం హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురికి ఎంట్రీ పాసులు పంపారు. పాసులు ఉన్నవారినే సభకు అనుమతించనున్నారు.